ఏపీ పోలీసు ఉపసంహరణ: సెలవులకు టీ ఇంటెలిజెన్స్ చీఫ్, రేవంత్ కేసు అధికారి మార్పు!
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పోలీసులు అవసరానికి మించి హైదరాబాదులో ఉండటం వల్ల ఏపీలో భద్రత, బందోబస్తు, ఇతర అవసరాలకు సర్దుబాటు చేయడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, వారిలో కొంతమందిని ఉపసంహరించుకుంటాని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు, డీజీపీ జేవీ రాముడు గవర్నర్ నరసింహన్కు వివరించారు.
మంగళవారం చంద్రబాబుతో భేటీ అయిన అనంతరం వారు రాజ్ భవన్ వెళ్లారు. తాము కేవలం 500 మందిని మాత్రమే ఉపసంహరించుకుంటామని చెప్పారు. దీనిపై రెండు రాష్ట్రాల డీజీపీలు చర్చించుకొని తుది నిర్ణయానికి రావాలని గవర్నర్ సూచించినట్లుగా తెలుస్తోంది.
హైదరాబాదులో తెలంగాణ భద్రత పైన తమకు నమ్మకం లేదని, అందులో కొందరు ఇన్ఫార్మర్లు ఉన్నట్లు తమకు సమాచారం ఉందని, ఫోన్ ట్యాపింగ్ ఎంతమాత్రం ఊహాజనితం కాదని, ట్యాపింగ్ జరిగిందని నిరూపించేందుకు ఆధారాలు కూడా ఉన్నాయని గవర్నర్కు చెప్పారని సమాచారం.
గవర్నర్తో సమావేశం అనంతరం బలగాల ఉపసంహరణకు ఏపీ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 18 పటాలాలు, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో రెండు పటాలాల ఏపీ పోలీసు బలగాలు విధులు నిర్వహిస్తున్నాయి. వీరిని ఉపసంహరించుకోవాలని నిర్ణయించారు.
చంద్రబాబు ఇంటి వద్ద భద్రత పెంపు
చంద్రబాబు ఇంటి వద్ద భద్రత పెంచారు. ప్రస్తుతం ఉన్న సిబ్బందితో పాటు అదనంగా మరో 60 మదిని నియమించారు. గ్రేహౌండ్స్, ఆక్టోబస్ విభాగాల నుంచి చెరో 30 మందిని భద్రత కోసం వినియోగిస్తున్నారు. ఇప్పటికే ఉన్న ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్, బెటాలియన్ సిబ్బందిని అలాగే కొనసాగిస్తున్నారు.
సెలవులకు వెళ్లిన శివధర్ రెడ్డి!
తెలంగాణ రాష్ట్రంలో కీలక సమయంలో తెలంగాణ ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డి సెలవులకు వెళ్లినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇంటెలిజెన్స్ చీఫ్గా అదనపు బాధ్యతలను హైదరాబాద్ సీపీ మహేందర్ రెడ్డికి అప్పగించారు.
రేవంత్ కేసులో దర్యాఫ్తు అధికారి మార్పు
రేవంత్ కేసును దర్యాఫ్తు చేస్తున్న అధికారిని ఏసీబీ అర్ధాంతరంగా మార్చిందని తెలుస్తోంది. అత్యంత కీలకమైన ఈ కేసుకు ఇప్పటి వరకు డీఎస్పీ స్థాయి అధికారి సారథ్యం వహించగా, ఇకపై అదనపు ఏస్పీ బాధ్యతలను నిర్వర్తించనున్నారు.