ఏపీకి నష్టం: కెసిఆర్కు బాబు ఝలక్!: జగన్పై రేవంత్ రెడ్డి ఆగ్రహం
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం కల్వకుర్తి ఎత్తిపోతల పథకం సామర్థ్యాన్ని పెంచటం పైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభ్యంతరం చెబుతోంది. ఇది పునర్విజన చట్టంలోని మార్గదర్శకాలను ఉల్లంఘించటమేనని, దీనిపై చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరింది.
ఇదే విషయమై కేంద్ర జలసంఘం ఛైర్మన్కు, కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సభ్య కార్యదర్శికి ఏపీ జల వనరుల శాఖ ముఖ్యకార్యదర్శి వారం రోజుల క్రితం లేఖ రాశారు. ఇందులో వారు పలు అంశాలను ప్రస్తావించారు.
కృష్ణా జలాలకు సంబంధించి అనేక అంశాలు సుప్రీం కోర్టు, కృష్ణా జల వివాద ట్రైబ్యునల్ 2, కృష్ణా నదీ యాజమాన్య బోర్డు, కేంద్ర ప్రభుత్వం ముందు ఉన్నాయని, తెలంగాణ ప్రభుత్వం పునర్విభజన చట్టాన్ని ఉల్లంఘిస్తే ఏపీ పైన ప్రభావం చూపుతుందని లేఖలో పేర్కొన్నారు.
జగన్కు తెలంగాణలో ఓటు అడిగే హక్కు లేదు: రేవంత్ రెడ్డి
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డికి తెలంగాణలో ఓటు అడిగే హక్కు లేదని తెలంగాణ టిడిపి నేత రేవంత్ రెడ్డి మంగళవారం మండిపడ్డారు. ఆయన వరంగల్ ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు.
రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకంగా ప్రచారం చేసిన జగన్కు వరంగల్ ఉప ఎన్నికలో ఓటు అడిగే హక్కు ఏమాత్రం లేదన్నారు. విపక్షాల ఓట్లను చీల్చేందుకే కేసీఆర్, జగన్ను రంగంలోకి దించారని ఆరోపించారు.