అపార్టుమెంట్వాసులకు చుక్కలు చూపిస్తున్న మాజీ ఐపీఎస్ కూతురు, ఫిర్యాదు
హైదరాబాద్: తమ అపార్టుమెంటులో ఉంటూ తమను మానసికంగా వేధిస్తున్న ఓ మాజీ ఐపీఎస్ కూతురు పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ అపార్టుమెంట్ వాసులు ఆదివారం ధర్నాకు దిగారు.
బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 12లోని శాంతినివాస్ అపార్టుమెంట్ వాసులు ఆదివారం పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు. తమకు రక్షణ కల్పించాలని నినాదాలు చేశారు. పోలీసులకు ఆమె పైన ఫిర్యాదు చేశారు.
అపార్ట్మెంట్లో నివసించే మాజీ ఐపీఎస్ కూతుర వికృత చేష్టలతో అపార్ట్మెంట్వాసులందరూ భయాందోళనలకు గురవుతున్నారని, రాత్రివేళల్లో ఆమె ఇంటి నుంచి కేకలు వినిపిస్తున్నాయని ఫిర్యాదు చేశారు. కాగా శనివారం నాడు ఆ యువతి పోలీస్ స్టేషన్కు వచ్చి సిబ్బంది పైన అరవడం, అనుమతి లేకుండా వీడియో తీయడంతో న్యూసెన్స్ కేసు నమోదు చేసినట్లు పోలీసులు చెప్పారు.
ఇదిలా ఉండగా, ఆ యువతి అంతకుముందు ఓ పావురం పట్ల శనివారం కర్కశంగా వ్యవహరించింది. ఓ పావురం ఎగురుగుంటూ బంజారాహిల్స్లో ఆమె ఉంటున్న అపార్టుమెంటులోకి వెళ్లింది. ఆ పావురాన్ని పట్టుకున్న ఆ యువతి... దాని మెడను కోసి, ఫ్లాట్కు వేలాడదీసింది.
ఇదేమిటని పక్కనున్న ప్రశ్నిస్తే... తన జోలికి వస్తే ఎవరికైనా ఇదే గతి అని హెచ్చరించింది. గత ఏడాది డిసెంబర్ నెలలో బంజారాహిల్స్లోని ఓ అపార్టుమెంటులో అద్దెకు దిగింది. ఆమె నిత్యం మిగతా ప్లాట్ల వారితో గొడవ పెట్టుకుంటుందనే ఆరోపణలు ఉన్నాయి.