ఏమిటా ‘గుడ్ న్యూస్’?: మంత్రి కేటీఆర్ చెప్పే ఆ న్యూస్ ఇదేనా?
హైదరాబాద్: 'గురువారం మీ అందరికీ ఒక పెద్ద వార్త చెబుతా. అదేమిటన్నది మాత్రం సస్పెన్స్' అని కేటీఆర్ మంగళవారం ట్విట్టర్లో పోస్ట్ చేశారు. అయితే ఇది ఎన్నికలకు సంబంధించిందా? లేక తన శాఖలకు సంబంధించిందా? అనే దానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది.
ఎల్లుండి సంచలన వార్త పంచుకుంటారట: ఆసక్తి రేపిన కెటిఆర్ ట్వీట్
ఏమిటా 'గుడ్ న్యూస్'? అంటే అంతర్జాతీయ టెక్నాలజీ దిగ్గజం యాపిల్ హైదరాబాద్లో తన డెవల్పమెంట్ సెంటర్ను ప్రారంభించడమేనా? అయితే కేటీఆర్ ఏం చెబుతారన్నది ప్రస్తుతానికి సస్పెన్స్. కానీ... యాపిల్ సీఈఓ టిమ్కుక్ గురువారం హైదరాబాద్కు వస్తున్నట్లు తెలిసింది.
అంతేకాదు హైదరాబాద్లో యాపిల్ డెవల్పమెంట్ సెంటర్ను ఆయన స్వయంగా ప్రారంభిస్తారని, తెలంగాణ ప్రభుత్వంతో ఒక ఎంవోయూ కుదుర్చుకుంటారని తెలుస్తోంది. దీనికి తోడు అదే రోజు పాలేరు ఉప ఎన్నికల ఫలితాలు కూడా రానున్నాయి. అయితే ఈ రెండింటిలో మంత్రి కేటీఆర్ చెప్పబోయే ఆ 'గుడ్ న్యూస్'? యావత్ తెలంగాణ ప్రజానీకం ఎదురు చూస్తోంది.
Will share a Big news with you all day after tomorrow. Suspense till then
— KTR (@KTRTRS) May 17, 2016
కాగా, నానక్రామ్గూడలోని తిష్మన్ స్పేయర్లోని వేవ్రాక్ టవర్లో డెవల్పమెంట్ సెంటర్కు అవసరమైన స్థలాన్ని యాపిల్ లీజుకు తీసుకుంది. ఇప్పటికే 10 కోట్ల డాలర్ల వరకు వెచ్చించింది. మరో ఏడాది కాలంలో ఈ డెవల్పమెంట్ కేంద్రాన్ని మరింత విస్తరించే అవకాశం ఉంది.
అమెరికా బయట యాపిల్ సంస్ధ ఏర్పాటు చేస్తున్న టెక్నాలజీ డెవల్పమెంట్ సెంటర్ ఇదే. ప్రస్తుతం చైనా పర్యటనలో ఉన్న టిమ్ కుక్, ఆ పర్యటనను ముగించుకొని మంగళవారం రాత్రి ఢిల్లీకి చేరుకున్నారు. ఢిల్లీలో ప్రధాని మోడీతో భేటీ అయ్యే అవకాశం ఉంది.
ఈ సమావేశంలో ప్రధాని మోడీ మేకిన్ ఇండియాలో భాగంగా భారత్లో యాపిల్ ఉత్పత్తుల కేంద్రాన్ని ఏర్పాటు చేసే విషయంలో టిమ్ కుక్ ప్రధాని వద్ద స్పష్టమైన ప్రతిపాదన ఉంచే అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా, టిమ్ కుక్ హైదరాబాద్ పర్యటన గురించి యాపిల్ ప్రతినిధులు గానీ, తెలంగాణ ప్రభుత్వంగానీ అధికారికంగా ధ్రువీకరించలేదు.
అయితే గురువారం హైదరాబాద్లో యాపిల్ సెంటర్ ప్రారంభోత్సవానికి ఒక ప్రతినిధి బృందం వస్తున్నట్టు మాత్రమే తమకు సమాచారం ఉందని, బృందంలో టిమ్ కుక్ ఉంటారా లేదా? అన్న విషయంలో స్పష్టత లేదని ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్ చెప్పారు. ఈ నేపథ్యంలో గురువారం కేటీఆర్ చెప్పబోయే 'గుడ్ న్యూస్' యాపిల్ గురించేనని ఊహాగానులు మొదలయ్యాయి.