ఏపీఎస్ఆర్టిసి బస్సు దగ్ధం.. 16మందికి తీవ్ర గాయాలు..
మహాబూబ్నగర్ జిల్లా బురెడ్డిపల్లి దగ్గర ఘోర ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి ఏపీలోని ధర్మవరం వెళ్తున్న ఏపీఎస్ఆర్టిసి బస్సు డీసిఎంను ఢీకొట్టింది. దీంతో మంటలు చెలరేగి బస్సు పూర్తిగా దగ్ధమైంది. డ్రైవర్తో పాటు 15మందికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 36 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. అయితే, ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరుగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.
ఆంధ్రప్రదేశ్లోని శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం ఆర్టీసీ డిపోకు చెందిన ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు హైదరాబాద్ లోని ఎంజీబీఎస్ నుంచి ప్రయాణికులతో ఆదివారం రాత్రి 12గంటలకు బయలుదేరింది. సోమవారం తెల్లవారుజామున 2.30 గంటలకు 44వ జాతీయ రహదారిపై జడ్చర్ల మండలం బురెడ్డిపల్లి మలుపు వద్దకు రాగానే, యూటర్న్ తీసుకునే క్రమంలో ఆర్టీసీ బస్సు డీసీఎంను ఢీకొట్టింది. ఆ ప్రమాద ధాటికి బస్సులో వెంటనే మంటలు చెలరేగాయి.

దీంతో బస్సు మొత్తం దగ్ధమయ్యింది. ఈ సంఘటనను చూసిన స్థానికులు పోలీసులు సమాచారం చేరవేసి, ఘటన స్థలానికి చేరుకుని బస్సులో చిక్కుకున్న వారిని బయటకు తీశారు. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటాన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. గాయపడినవారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో, మెరుగైన చికిత్స కోసం వారిని హైదరాబాద్కు తరలించారు.
చికిత్స అనంతరం ఎనిమిది మంది డిశ్చార్జీ అవ్వగా, మరో ఐదుగురు మహబూబ్నగర్లో చికిత్స పొందుతున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే, ప్రమాద సమయంలో బస్సులో 36 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. బస్సులో ప్రయాణిస్తున్న వారిలో ఎక్కువగా అనంతపురం ఉమ్మడి జిల్లా, హైదరాబాద్ ప్రాంతానికి చెందిన వారే ఉన్నట్లు తెలుస్తోంది. ఇక, ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.












Click it and Unblock the Notifications