Huzurabad : కేసీఆర్కు షాకివ్వనున్న ఆర్వవైశ్యులు... ఉపఎన్నిక బరిలో 500 మంది...?
తెలంగాణ రాజకీయమంతా ప్రస్తుతం హుజురాబాద్ నియోజకవర్గం,దళిత బంధు పథకాల చుట్టే తిరుగుతోంది. దళిత బంధు అమలు విషయంలో ప్రభుత్వ చిత్తశుద్దిపై ఇప్పటికే ఎన్నో అనుమానాలు,సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ప్రకటించిన 'దళితులకు మూడెకరాల భూమి' హామీ లాగే ఇది కూడా మిగిలిపోతుందన్న విమర్శలున్నాయి. ప్రభుత్వం మాత్రం దళితుల అభివృద్ది కోసం తాము కమిటెడ్గా ఉన్నామని చెబుతోంది. ఈ పథకాన్ని సక్సెస్ చేయడం ద్వారా హుజురాబాద్లో గెలుపును కాంక్షిస్తోంది. అటు ప్రత్యర్థి పార్టీలు కేసీఆర్ హామీల డొల్లతనాన్ని ఎండగడుతూ టీఆర్ఎస్ను ఓడించే ప్రయత్నంలో ఉన్నారు. రాజకీయ పార్టీల సంగతి పక్కనుంచితే... ఇదే హుజురాబాద్ వేదికగా తమ డిమాండ్ల సాధనకు పలు సంఘాలు కూడా బరిలో దిగుతుండటం గమనార్హం.

ఆర్య వైశ్య సంఘం తరుపున 500 మంది?
హుజురాబాద్ ఉపఎన్నిక బరిలో నిలిచేందుకు ఇప్పటికే వెయ్యి మంది ఫీల్డ్ అసిస్టెంట్లు సిద్ధమయ్యారు. తాజాగా ఆర్వవైశ్య సంఘం కూడా ఇదే బాటలో నడిచేందుకు సిద్ధమవుతోంది. ఆ సామాజికవర్గం నుంచి హుజురాబాద్ ఉపఎన్నికలో 500 మందిని పోటీలో నిలిపే యోచనలో ఉంది. ఆర్యవైశ్యులకు ప్రత్యేక కార్పోరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పి మాట తప్పిన ప్రభుత్వానికి తమ వ్యతిరేకతను వ్యక్తం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. ప్రత్యేక కార్పోరేషన్ ఏర్పాటు చేసి రూ.1000 కోట్లు నిధులు కేటాయించని పక్షంలో పోటీకి సిద్దమని ఆర్యవైశ్య చైతన్య పోరాట సమితి చెబుతోంది.

తమను ఆదుకోవాలని డిమాండ్...
కొంతమంది ఆర్యవైశ్యులకు ప్రభుత్వం పదవులు ఎరవేసి తమ సామాజికవర్గాన్ని నిర్లక్ష్యం చేస్తోందని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో చాలామంది ఆర్యవైశ్యులు వ్యాపారాలు నడవక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెబుతున్నారు. ఇప్పటికే సూపర్ మార్కెట్ల రాకతో తమ దుకాణాలన్నీ మూతపడే పరిస్థితి వచ్చిందని... ఇలాంటి సంక్లిష్ట సమయంలో ప్రభుత్వం తమను ఆదుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కేవలం ఎన్నికలు వచ్చినప్పుడే ఆర్యవైశ్యుల గురించి మాట్లాడి ఆ తర్వాత ముఖం చాటేయడం సరికాదంటున్నారు.

బరిలో 1000 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు?
హుజురాబాద్ ఉపఎన్నిక బరిలో పోటీ చేయాలని ఇప్పటికే ఫీల్డ్ అసిస్టెంట్ల సంఘం నిర్ణయించింది. దాదాపు 1వెయ్యి మందిని బరిలో దింపాలనే యోచనలో ఉంది. ఒకవేళ అదే జరిగితే పాత రికార్డులన్నీ బ్రేక్ అవుతాయి. గతంలో 2019 లోక్సభ ఎన్నికల్లో పసుపు బోర్డు డిమాండుతో నిజామాబాద్లో 175 మంది రైతులు ఎన్నికల్లో పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో అప్పటి సిట్టింగ్ ఎంపీ కవిత ఓటమిపాలయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా తొలగించిన 7600 మంది ఫీల్డ్ అసిస్టెంట్లను తక్షణమే విధుల్లోకి తీసుకోకపోతే.. టీఆర్ఎస్ను ఓడించడమే లక్ష్యంగా బరిలో దిగుతామని ఆ సంఘం హెచ్చరిస్తోంది. ఇప్పుడు ఈ జాబితాలో ఆర్యవైశ్య సంఘం కూడా చేరుతుండటంతో టీఆర్ఎస్కు షాక్ తప్పదా అన్న చర్చ జరుగుతోంది.

టీఆర్ఎస్ ధీమా ఏంటి?
అటు ప్రత్యర్థి పార్టీలు,ఇటు ఫీల్డ్ అసిస్టెంట్లు,ఆర్యవైశ్యుల సంఘాలు టీఆర్ఎస్ను గట్టిగా టార్గెట్ చేస్తున్నప్పటికీ అధికార పార్టీ మాత్రం చాలా ధీమాతో ఉన్నట్లు తెలుస్తోంది. నియోజకవర్గంలో దళితుల ఓట్లు దాదాపు 50వేల పైచిలుకు ఉంటాయన్న వాదన ఉంది. దళిత బంధు పథకం ద్వారా ఆ సామాజికవర్గంలో ఎక్కువమందికి లబ్ది చేకూర్చితే విజయం తమదేనన్న ధీమాలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఒక్క హుజురాబాద్లోనే రూ.2వేల కోట్ల పైచిలుకు డబ్బును ఖర్చు పెట్టే యోచనలో ఉంది. అయితే దళితుల్లోనూ ఈ పథకం అందరికీ చేరకపోతే అది మిస్ ఫైర్ అయ్యే అవకాశం లేకపోలేదన్న వాదన కూడా ఉంది. మొత్తానికి హుజురాబాద్ వేదికగా రోజురోజుకు రాజకీయం రక్తి కడుతోంది.












Click it and Unblock the Notifications