అసదుద్దీన్ ఓవైసీ ప్రమాణస్వీకారంపై పార్లమెంట్ లో దుమారం
18వ లోక్సభకు ఇటీవల ఎన్నికైన ఎంపీల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతున్న విషయం తెలిసిందే. లోక్సభ సమావేశాలలో లోక్ సభ సభ్యులతో ప్రామాణ స్వీకారం జరుగుతుంది. లోక్సభ ఎన్నికలలో విజయం సాధించిన ఎంపీలతో స్పీకర్ ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అయితే నేడు హైదరాబాద్ ఎంపీ, అసదుద్దీన్ ఓవైసీ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేయడం పెద్ద వివాదాన్ని రాజేసింది.
ఉర్దూలో ప్రమాణ స్వీకారాన్ని చేసి జై పాలస్తీనా అన్న అసదుద్దీన్ ఓవైసీ
ఎంఐఎం అధినేత, హైదరాబాద్ లోక్ సభ సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ ఉర్దూలో ప్రమాణ స్వీకారాన్ని చేసి జై పాలస్తీనా అంటూ వ్యాఖ్యలు చేయడం సభలో తీవ్ర అభ్యంతరానికి కారణంగా మారింది. అసదుద్దీన్ ఓవైసీ ప్రమాణస్వీకారం చేసే సమయంలో కొందరు అధికార పార్టీ ఎంపీలు జైశ్రీరామ్, భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేశారు.

తీవ్ర అభ్యంతరం, రికార్డుల నుండి తొలగిస్తామన్న స్పీకర్
ఆపై ఓవైసీ ప్రమాణస్వీకారం చేసి జై భీమ్, జై మీమ్, జై పాలస్తీనా.. జై తెలంగాణ.. అల్లాహు అక్బర్ అంటూ నినాదాలు చేయడంతో సభలో రచ్చ మొదలైంది. అసదుద్దీన్ ఓవైసీ జై పాలస్తీనా అంటూ చేసిన వ్యాఖ్యలపైన కొందరు పార్లమెంటు సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే లోక్సభ సభ్యుల అభ్యంతరం నేపథ్యంలో రికార్డుల నుంచి అసదుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యలను తొలగిస్తామని ప్రొటెం ప్యానెల్ స్పీకర్ రాధామోహన్ సింగ్ పేర్కొన్నారు.
సభలో తెలంగాణా ఎంపీల ప్రమాణం
తెలంగాణ రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్, బిజెపి సభ్యులతో పాటు హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కూడా నేడు లోక్సభలో ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఆయన ప్రమాణస్వీకారం నేపథ్యంలో జై పాలస్తీనా అనడంతో రగడ చోటుచేసుకుంది. ఇదిలా ఉంటే ఆదిలాబాద్ ఎంపీ గోడెం నగేష్ హిందీలో ప్రమాణస్వీకారం చేశారు.
ఇంగ్లిష్, తెలుగు, హిందీలో సభ్యుల ప్రమాణం
గడ్డం వంశీకృష్ణ, ధర్మపురి అరవింద్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, రామసాయం రఘురామిరెడ్డి, ఇంగ్లీషులో ప్రమాణం చేశారు. ఈటల రాజేందర్, డీకే అరుణ, కుందూరు రఘువీర్, చామల కిరణ్ కుమార్ రెడ్డి, మల్లు రవి, సురేష్ షెట్కర్, తెలుగులో ప్రమాణం చేశారు. ఎంపీ కడియం కావ్య ప్రమాణస్వీకారం అనంతరం జై భద్రకాళి అంటూ నినదించారు.












Click it and Unblock the Notifications