వడ్డీల మోహన్ రెడ్డి లొంగుబాటు: నయీమ్తో సంబంధాలపై ఆరా
కరీంనగర్: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రుణాలిస్తూ వడ్డీల కోసం అప్పు తీసుకున్న వారిని చిత్రహింసలకు గురిచేసిన ఏఎస్ఐ మోహన్రెడ్డి సోమవారం రాత్రి కరీంనగర్ జిల్లా ఎస్పీ ఎదుట లొంగిపోయారు. కెన్క్రెస్ట్ పాఠశాల ఛైర్మన్ ప్రసాదరావు ఆత్మహత్య కేసులో అరెస్టయిన మోహన్రెడ్డి.. అనంతరం బెయిల్పై బయటకు వచ్చాడు.
మరో కోణం: నయీం ముఠాతో ఏఎస్ఐ వడ్డీల మోహన్ రెడ్డి సెటిల్మెంట్లు
15 రోజుల కిందట బెజ్జంకి మండలం గుండ్లపల్లికి చెందిన చాడ నారాయణరెడ్డి ఆత్మహత్య చేసుకున్నారు. ఏఎస్ఐ మోహన్రెడ్డి తన స్థలాన్ని తిరిగి ఇవ్వడం లేదని, అతని వేధింపుల కారణంగానే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు నారాయణ రెడ్డి తన సూసైడ్ నోట్లో పేర్కొనడంతో కరీంనగర్ రెండో పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు.
కాగా, గ్యాంగ్స్టర్ నయీంతో మోహన్రెడ్డికి సంబంధాలు ఉన్నాయని ఆయన బాధితులు మీడియా సమావేశంలో ఆరోపించడం.. అప్పటి నుంచి మోహన్రెడ్డి కనిపించకపోవడం పలు అనుమానాలకు తావిచ్చింది. ఈ నేపథ్యంలో జిల్లా పోలీసు ఉన్నతాధికారులు మోహన్రెడ్డి కోసం గాలింపు చేపట్టారు.
ఈ క్రమంలో కరీంనగర్కు చెందిన ఓ సీనియర్ న్యాయవాది ద్వారా ఆయన సోమవారం రాత్రి జిల్లా ఎస్పీ ఎదుట లొంగిపోయినట్లు తెలిసింది. మోహన్రెడ్డిను అదుపులోకి తీసుకున్న పోలీసులు మంగళవారం కరీంనగర్ న్యాయస్థానంలో హాజరుపరచనున్నారు. గ్యాంగ్స్టర్ నయీమ్తో సంబంధాలపైనా పోలీసులు మోహన్ రెడ్డిని విచారించనున్నారు.