చిలుకూరు ప్రధాన అర్చకుడిపై దాడి.. పవన్ కళ్యాణ్ ఏమన్నారంటే!
చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు అయిన రంగరాజన్ పై ఒక గ్యాంగ్ దాడి చేసిన నేపథ్యంలో ఈ దాడిని పలువురు తీవ్రంగా ఖండిస్తున్నారు. చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ పై జరిగిన దాడిని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఖండించారు. ఇది ఒక వ్యక్తి పైన జరిగిన దాడి కాదని ఇది ధర్మ పరిరక్షణ పైన చోటు చేసుకున్న దాడి అని ఆయన అభిప్రాయపడ్డారు.
చిలుకూరు ప్రధాన అర్చకుడిపై దాడిని ఖండించిన పవన్ కళ్యాణ్
చిలుకూరులోని ప్రసిద్ధ బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకులు రంగరాజన్ పై ఒక మూక దాడి చేసిందని తెలిసి తన తీవ్ర ఆవేదనకు లోనయ్యానని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ఇది దురదృష్టకరమైన సంఘటనగా ఆయన అభివర్ణించారు. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు. కొన్ని దశాబ్దాలుగా రంగరాజన్ ధర్మ పరిరక్షణకు, ఆలయాల వారసత్వ సంపదకు, సంప్రదాయాలు, పవిత్రతను కాపాడడానికి తపిస్తున్నారని పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారని పేర్కొన్నారు.

దాడి వెనుక నిజానిజాలు నిగ్గు తేల్చాలన్న పవన్ కళ్యాణ్
రామరాజ్యం అనే సంస్థ సభ్యులమని చెప్పి వెళ్లిన ఒక మూక రంగరాజన్ పై దాడి చేయడం వెనుక ఉన్న కారణాలు ఏమిటో పోలీసులు నిగ్గు తేల్చాలని పేర్కొన్నారు. రంగరాజన్ పై దాడి చేసిన మూకను నడిపిస్తున్నది ఎవరో గుర్తించి కఠినంగా శిక్షించాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. ఈ దాడిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించాలని ఆయన పేర్కొన్నారు.
దాడిని ప్రతీ ఒక్కరూ ఖండించాలన్న ఏపీ డిప్యూటీ సీఎం
సనాతన ధర్మ పరిరక్షణ కోసం పలు విలువైన సూచనలను రంగరాజన్ తనకు అందించారని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. హిందు ఆలయాల నిర్వహణ, ధర్మ పరిరక్షణ పైన ఆయన ఎంతో తపన పడుతున్నారని ఆయనపై చోటు చేసుకున్న దాడిని ప్రతి ఒక్కరు ఖండించాలని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
దాడి చేసిన వారి కోసం మొయినాబాద్ పోలీసులు గాలింపు చర్యలు
ఇదిలా ఉంటే రంగరాజన్ పైన జరిగిన దాడిపై ఆయన తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. ఆ గ్యాంగ్ నాయకుడిగా భావిస్తున్న వీర రాఘవ రెడ్డి అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. గ్యాంగ్ లోని మిగిలిన సభ్యుల కోసం మొయినాబాద్ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.












Click it and Unblock the Notifications