కాంగ్రెస్ నేత వీహెచ్ ఇంటిపై దాడి - కారు ధ్వంసం : గతంలోనే బెదిరింపులు - రేవంత్ పరామర్శ..!!
కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు ఇంటి పైన దాడి జరిగింది. ఆయన ఇంటి పైన దుండగులు అర్ద్రరాత్రి దాడికి పాల్పడ్డారు. వీహెచ్ కారును ధ్వంసం చేసారు. హైదరాబాద్ లోని డీడీ కాలనీలో వీహెచ్ నివాసం ఉంటున్నారు. ఆయన ఇంటి పైన రాళ్లు వేయటంతో..ఆయన కారు అద్దాలు ధ్వంసం అయ్యాయి. ఈ ఘటన చోటు చేసుకున్న వెంటనే వీహెచ్ అంబర్ పేట పోలీసులకు ఫిర్యాదు చేసారు. ఆ సమయంలో వీహెచ్ ఇంట్లోనే ఉన్నారు. ఇంట్లో ఉన్న ఎవరికీ గాయాలు కాలేదు. పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. ఈ దాడికి పాల్పడిన వారు ఎవరనే కోణంలో విచారణ ప్రారంభించారు.
సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే వీహెచ్ కు గతంలోనూ పలు బెదిరింపు కాల్స్ వచ్చాయి. దీంతో..ఆయన పోలీసులకు అప్పట్లోనే ఫిర్యాదు చేసారు. మాజీ పిసిసి అధ్యక్షుడిగా, మంత్రిగా పనిచేసిన తనకు కనీస రక్షణ బాధ్యత ప్రభుత్వానికి లేదా అని వీహెచ్ ప్రశ్నించారు. తాను గతంలోనే పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా.. రక్షణ కల్పించలేదని వాపోతున్నారు. తాను ఎప్పుడూ బలహీన వర్గాల సమస్యల పైన మాట్లాడుతున్నాని..ఈ దాడికి పాల్పడింది ఎవరో తేల్చాలని వీహెచ్ డిమాండ్ చేసారు.
మాజీ ఎంపీ వి. హనుమంతరావు రావు ఇంటి పైన దుండగుల దాడిని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఖండించారు. హనుమంతరావు తో ఫోన్ లో మాట్లాడిన రేవంత్ రెడ్డి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వీహెచ్ ను పరామర్శించారు. దోషులను పోలీసులు వెంటనే గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేసారు. వి.హనుమంతరావు ప్రజల మనిషి ఎవరి ఆపద వచ్చిన ముందుంటారు అలాంటి వ్యక్తిపై దాడి ఏమిటని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్ నాయకులకు పోలీసులు మరింత భద్రత కల్పించాలని కోరారు. కాంగ్రెస్ నాయకులపై దాడులు జరిగితే ఊరుకునేది లేదు.. దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేసారు.