నేటి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్
తెలంగాణలో ఆరోగ్యశ్రీ సేవలు నేటి నుంచి స్తంభించిపోనున్నాయి. ఈ విషయాన్ని తెలంగాణ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ వెల్లడించింది. ఈ అర్ధరాత్రి నుండి ఆరోగ్యశ్రీ పథకం కింద తమ సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. సుమారు 1,400 కోట్ల రూపాయల మేర బకాయిలు పేరుకుపోవడంతో ప్రైవేట్ ఆసుపత్రులు ఈ నిర్ణయం తీసుకున్నాయి. నెట్ వర్క్ కిందకు వచ్చే ప్రైవేట్ ఆసుపత్రులేవీ కూడా ఆరోగ్యశ్రీ కింద కార్డుదారులకు ఎటువంటి ట్రీట్ మెంట్ ను కూడా అందించవు.
బకాయిల చెల్లింపుపై గతంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చకపోవడంతో సేవలను నిలిపివేయడం తప్ప వేరే మార్గం లేదని ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ పేర్కొంది. ఈ సేవలు నిలిచిపోవడం వల్ల డయాలసిస్, ఇంటెన్సివ్ కేర్, అత్యవసర చికిత్సలు వంటి కీలక సేవలకు తీవ్ర అంతరాయం కలుగుతుంది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 350 ఆసుపత్రులు, ముఖ్యంగా చిన్న, మధ్య తరహా సంస్థలు ఈ నిరసనలో పాల్గొంటున్నాయి.

ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు వద్దిరాజు రాకేష్ మాట్లాడారు. ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ తో అనేకసార్లు చర్చలు జరిపినప్పటికీ.. బకాయిల చెల్లింపుల్లో తీవ్ర జాప్యం జరుగుతోందని అన్నారు. గతంలో ఇచ్చిన హామీలను కూడా ప్రభుత్వం నెరవేర్చట్లేదని చెప్పారు. 40 రోజుల్లో బకాయిలన్నింటినీ కూడా తీర్చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని, ఇప్పటికీ అది అమలు కావట్లేదని అన్నారు.
బకాయిలను 40 రోజుల్లో చెల్లిస్తామని గతంలో ప్రభుత్వ చెప్పిందని, ఇప్పుడు సంవత్సర కాలం గడిచిపోయినప్పటికీ దాన్ని నెరవేర్చట్లేదని రాకేష్ వివరించారు. ఈ పథకం సక్రమంగా పనిచేయడానికి ప్రతీ 40 రోజులకు 100 నుండి 150 కోట్ల రూపాయలు అవసరమౌతాయని, దాదాపు ఏడాదిగా రీయింబర్స్మెంట్లన్నీ ఎక్కడికక్కడ నిలిచిపోయాయని చెప్పారు. ఈ సమస్య జిల్లా, గ్రామీణ ఆసుపత్రులలో మరింత తీవ్రంగా ఉందని పేర్కొన్నారు.
ఇక్కడ 80 నుండి 85 శాతం మంది ఆరోగ్యశ్రీ రోగులకు చికిత్స అందిస్తున్నారని రాకేష్ తెలిపారు. హైదరాబాద్లో 15 నుండి 20 శాతం మంది రోగులు మాత్రమే ఈ పథకం కిందకు వస్తారని, ఇక్కడి ఆసుపత్రులు బీమా, నగదు చెల్లింపులపై ఎక్కువగా ఆధారపడుతుంటాయని, పట్టణాల్లోని ఆసుపత్రులు దాదాపు పూర్తిగా ఆరోగ్యశ్రీ రీయింబర్స్మెంట్లపైనే ఆధారపడతాయని ఆయన వ్యాఖ్యానించారు. 1,400 కోట్ల రూపాయల మేర బకాయిలు నిలిచిపోవడం వల్ల తీవ్ర ఆర్థిక భారాన్ని భరించాల్సి వస్తోందని అన్నారు.
ఆరోగ్య శాఖ, ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ పలుమార్లు హామీలు ఇచ్చినప్పటికీ, తమ సమస్యలకు పరిష్కారం లభించట్లేదని పేర్కొన్నారు. ఫలితంగా సెప్టెంబర్ 16వ అర్ధరాత్రి నుండి తెలంగాణలోని అన్ని ప్రైవేట్ నెట్వర్క్ ఆసుపత్రులలో సేవలను నిరవధికంగా నిలిపివేయడం తప్ప వేరే మార్గం లేదని తేల్చి చెప్పారు.












Click it and Unblock the Notifications