టీఆర్ఎస్ కార్యకర్తల అత్యుత్సాహం - తీవ్రంగా గాయపడ్డ ఆటోడ్రైవర్
సంగారెడ్డి: సంగారెడ్డిలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. టీఆర్ఎస్ కార్యకర్తల అత్యుత్సాహం ఓ ఆటో డ్రైవర్ను తీవ్రంగా గాయపరిచింది. ఒళ్లంతా కాలిన గాయాలతో ఆ ఆటోడ్రైవర్ ఆసుపత్రి పాలయ్యారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు మెడికల్ కళాశాలల ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని టీఆర్ఎస్ కార్యకర్తలు నిర్వహించిన విజయోత్సవ ర్యాలీలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రతి జిల్లాలో ఓ మెడికల్ కాలేజీని నిర్మించాలనేది ప్రభుత్వం లక్ష్యం.
కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రంలో ఎనిమిది వైద్య కళాశాలలను నిర్మించిన విషయం తెలిసిందే. వాటన్నింటినీ ఈ ఉదయం కేసీఆర్ ప్రారంభించారు. హైదరాబాద్ ప్రగతి భవన్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వాటిని లాంఛనంగా అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆన్లైన్ విధానంలో తరగతులను ప్రారంభించారు. దీనితో ఇప్పటివరకు ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాలల సంఖ్య 17కు పెరిగింది. కొత్త కళాశాలలు అందుబాటలోకి రావడంతో అదనంగా 1,150 మంది విద్యార్థులకు వైద్యవిద్య అందనుంది.

మంచిర్యాల, రామగుండం, జగిత్యాల, భద్రాద్రి కొత్తగూడెం, వనపర్తి, నాగర్ కర్నూలు, మహబూబాబాద్, సంగారెడ్డిల్లో ఇవి ప్రారంభం అయ్యాయి. ఇవ్వాళ్టి నుంచి విద్యాబోధనకు కేసీఆర్ శ్రీకారం చుట్టారు. సంగారెడ్డిలో మెడికల్ కాలేజీ అందుబాటులోకి రావడంతో టీఆర్ఎస్ కార్యకర్తలు ఆనందోత్సాహాలను వ్యక్తం చేశారు. భారీ ఎత్తున బైక్ ర్యాలీని నిర్వహించారు. వైద్య కళాశాల ప్రారంభోత్సవాన్ని పండగలా జరుపుకొన్నారు.
ఈ సందర్భంగా భారీగా బాణాసంచాను కాల్చారు. అక్కడ అపశృతి చోటు చేసుకుంది. పేలిన బాణాసంచాలన్నీ అటుగా వెళ్తోన్న ఆటోపై పడ్డాయి. క్షణంలో మంటలు అంటుకున్నాయి. ఈ మంటల్లో ఆటోడ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. ఒళ్లంతా కాలిన గాయాలయ్యాయి. పక్కనే ఉన్న టీఆర్ఎస్ కార్యకర్తలు మంటలు ఆర్పడానికి ప్రయత్నించే సరికే పరిస్థితి చేయి దాటింది. పక్కనే బట్టల దుకాణం నుంచి శాలువాలను తీసుకొచ్చి అతనిపై కప్పారు.












Click it and Unblock the Notifications