గద్దర్ అవార్డుల ప్రత్యేక కమిటీ ఛైర్మన్గా బీ నర్సింగరావు, దిల్ రాజుకు చోటు
తెలంగాణ ప్రభుత్వం తెలుగు సినీ పరిశ్రమకు ఇచ్చే గద్దర్ అవార్డుల విషయంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇచ్చిన ప్రతిపాదనలను పరిశీలించిన ప్రభుత్వం.. గద్దర్ అవార్డుల విధి విధానాలు, నియమ నిబంధనలు, లోగోను రూపొందించేందుకు సినీ ప్రముఖులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.
గద్దర్ అవార్డుల కమిటీకి ప్రముఖ దర్శకులు బీ నర్సింగరావు ఛైర్మన్గా వ్యవహరించనుండగా, మరో ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు వైస్ ఛైర్మన్గా ఉంటారని ప్రభుత్వం వెల్లడించింది. అలాగే కమిటీ సలహాదారులుగా దర్శకేంద్రుడు రాఘవేందర్ రావు, అందెశ్రీ, తమ్మారెడ్డి భరద్వాజ, దగ్గుబాటి సురేశ్ బాబు, చంద్రబోస్, ఆర్.నారాయణమూర్తి, వందేమాతరం శ్రీనివాస్, అల్లాణి శ్రీధర్, సానా యాదిరెడ్డి, హరీశ్ శంకర్, బలగం వేణులతోపాటు ఎఫ్డీసీ ఎండీ మెంబర్ కన్వీనర్గా కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ఎఫ్డీసీ ఈ కమిటీతో చర్చించి తదుపరి కార్యాచరణ మొదలుపెట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. కాగా, గద్దర్ పేరిట అవార్డులు ఇస్తామని ప్రకటించిన అనంతరం చిత్ర పరిశ్రమ తమని సంప్రదించలేదని ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత వెంటనే టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా ఎక్స్ వేదికగా స్పందించారు. ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ ప్రతిపాదనను ప్రతిష్ఠాత్మకంగా ముందుకు తీసుకెళ్లాలని కోరారు.
తెలుగు చిత్ర పరిశ్రమ తరఫున ఫిలిం ఛాంబర్, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఈ విషయమై దృష్టి సారించాలని సీఎం విజ్ఞప్తి చేశారు. దీంతో తెలుగు ఫిల్మ్ ఛాంబర్, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, గద్దర్ అవార్డులపై తెలంగాణ రాష్ట్ర ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్(ఎఫ్డీసీ)తో చర్చించి, విధి విధానాలను రూపొందించి ఎఫ్డీసీ ద్వారా ప్రభుత్వానికి అందజేశాయి. ఆ నివేదికల ఆధారంగా ఛైర్మన్, వైస్ ఛైర్మన్తో పాటు, కమిటీ సభ్యులను ఎంపిక చేసి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా వెల్లడించింది. కాగా, నంది అవార్డుల స్థానంలో ప్రజా గాయకుడు గద్దర్ పేరు మీదుగా అవార్డులు ఇవ్వనున్నట్లు గతంలో సీఎం రేవంత్ ప్రకటించిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications