అందుకే కెటిఆర్ రాలేదు, అడగ్గానే ఒప్పుకున్నారు: హీరో బాలకృష్ణ
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావుకు ఆరోగ్యం బాగా లేకపోవడం వల్లే పింక్ రిబ్బన్ వాక్ కార్యక్రమానికి హాజరుకాలేకపోయారని నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆదివారం వెల్లడించారు.
ఈ కార్యక్రమానికి రావాలని కెటీఆర్ను ఆహ్వానించగానే ఆనందంగా అంగీకరించారన్నారు. అయితే, ఈ ఉదయం ఒంట్లో బాగాలేకపోయినందున కేటీఆర్ రాలేదని తెలిపారు. అయినప్పటికీ, తాను అడగ్గానే ఒప్పుకున్నందుకు ఆయనకు కృతజ్ఞతలన్నారు.

బసవ తారకం క్యాన్సర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో బంజారాహిల్స్లోని కెబిఆర్ పార్క్ వద్ద ఆదివారం ఉదయం రొమ్ము క్యాన్సర్ పైన అవగాహన కోసం అవగాహన వాక్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడారు.

ప్రజల్లో కేన్సర్ మహమ్మారి పట్ల మరింతగా అవగాహన పెరగాలన్నారు. అందుకు మీడియా కృషి చేయాలని సూచించారు. బసవతారకం కేన్సర్ ఆసుపత్రిని ఓ దేవాలయంలా నిర్వహిస్తున్నామని, ఇక్కడికి వచ్చేవారు సైతం దీన్ని ఆసుపత్రిలా భావించడం లేదన్నారు.

పదిహేనేళ్ల క్రితం 100 పడకలు, మూడు అంతస్తులతో ప్రారంభమైన ఆసుపత్రి, ఇప్పుడు 500 పడకలకు, బహుళ అంతస్తుల భవనాలకు విస్తరించిందన్నారు. తుది దశ కేన్సర్ రోగులు సైతం ఇక్కడి నుంచి పూర్తిగా చికిత్స పొంది ఇళ్లకు వెళ్లారన్నారు. ప్రతి ఒక్కరూ కేన్సర్ పరీక్షలు చేయించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో బాలకృష్ణతో పాటు గోపీచంద్, అంజలి, హేమ తదితరులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications