రేవంత్ రెడ్డి చంచల్ గూడ జైలులో చిప్పకూడు తిన్న 420: బాల్క సుమన్ రివర్స్ ఎటాక్
తెలంగాణ రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా రాహుల్ గాంధీ తెలంగాణ రైతాంగం పక్షాన ప్రతి ధాన్యం గింజ కొనుగోలు చేసే దాకా కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని, టీఆర్ఎస్, బిజెపిలు రైతుల శ్రమ దోచుకుంటూ రాజకీయాలు చేస్తున్నారని చేసిన వ్యాఖ్యలపై కవిత, కేటీఆర్ లు రాహుల్ గాంధీని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. దీంతో కవిత, కేటీఆర్ లపై రేవంత్ రెడ్డి మండిపడ్డారు.
కేటీఆర్ పై రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు బాల్క సుమన్ కౌంటర్
కవిత, కేటీఆర్ లు చేసిన వ్యాఖ్యలకు రేవంత్ రెడ్డి ఘాటుగా సమాధానమిచ్చారు. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి రైతుల పక్షాన పోరాటం చేస్తుందని, దేశం కోసం కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో తెలియకపోతే మీ నాయన కెసిఆర్ ను అడగమని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. దీంతో ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ రేవంత్ రెడ్డి పై తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. రేవంత్ రెడ్డి చంచల్ గూడ జైలులో చిప్పకూడు తిన్న 420 రేవంత్ రెడ్డి అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే ఊరుకోం
రేవంత్ రెడ్డి ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడిన బాల్క సుమన్ రాహుల్ గాంధీకి తెలుగు రాదని, వీళ్ళు ఎవరో పంపితే పోస్టు చేసినట్టు ఉన్నారంటూ వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని బాల్క సుమన్ పేర్కొన్నారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై రేవంత్ రెడ్డి చేసిన విమర్శలకు కౌంటర్ ఇచ్చిన ఆయన కేటీఆర్ పై రేవంత్ రెడ్డి ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి కాదు రవ్వంత రెడ్డి అంటూ బాల్క సుమన్ సెటైర్లు వేశాడు.
కేటీఆర్ ముందు రేవంత్ రెడ్డి రవ్వంత మాత్రమే
కేటీఆర్ ముందు రేవంత్ రెడ్డి ఒక్క రవ్వంత మాత్రమేనని బాల్క సుమన్ పేర్కొన్నారు. కేటీఆర్ పై విమర్శలు చేసేటప్పుడు ఒళ్ళు దగ్గరపెట్టుకోవాలని రేవంత్ రెడ్డి బాల్క సుమన్, కేటీఆర్ గ్లోబల్ లీడర్ గా ఎదగారని పేర్కొన్నారు. బీజేపీకి కాంగ్రెస్ పార్టీ లోపాయికారిగా పనిచేస్తుందని మండిపడ్డారు. తెలంగాణ రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు నిలబడలేదని బాల్క సుమన్ ఆరోపించారు.ఇరిగేషన్ ప్రాజెక్టులను అడ్డుకోవడం కోసం కాంగ్రెస్ నేతలు ప్రయత్నాలు చేశారని మండిపడ్డారు.
బీజేపీకి అవుట్ సోర్సింగ్ ఏజెంట్ లా రేవంత్ రెడ్డి
విషయం లేక ఇరిగేషన్ ప్రాజెక్టుల పై చర్చించలేక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ నుంచి మొహం చాటేశారని బాల్క సుమన్ ఎద్దేవా చేశారు. బీజేపీకి అవుట్ సోర్సింగ్ ఏజెంట్ లా రేవంత్ రెడ్డి పనిచేస్తున్నట్టు ఉందని బాల్క సుమన్ విమర్శించారు. లోపాయికారిగా బీజేపీకి కాంగ్రెస్ చిత్తశుద్ధితో సహకరిస్తోందని ఆరోపించిన ఆయన రేవంత్ రెడ్డి బజారు మనిషిలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పెయింటర్ రెడ్డి నుండి పెయిడ్ రెడ్డి అయ్యారు రేవంత్ అని, రేవంత్ రెడ్డిది నకిలీ మకిలి చరిత్ర అని తీవ్ర పదజాలంతో మండిపడ్డారు బాల్క సుమన్.