అలా వద్దు: హరీష్కు దత్తాత్రేయ, ఏపీ-తెలంగాణ పోటీ, మనోళ్లే సగం: వెంకయ్య
హైదరాబాద్/వరంగల్: తెలంగాణ రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు పైన బండారు దత్తాత్రేయ ఆదివారం మండిపడ్డారు. ప్రధాని నరేంద్ర మోడీ పైన హరీష్ వ్యాఖ్యలు సరికాదన్నారు. పత్తి కొనుగోలుపై తెలంగాణ ప్రభుత్వం కేంద్రం మార్గదర్శకాలను పాటించడం లేదన్నారు.
కరవు జిల్లాల జాబితాను ఇప్పటి వరకు ఇవ్వలేదని మండిపడ్డారు. కేంద్రానికి అన్ని రాష్ట్రాలు సమానమేనని చెప్పారు. వరంగల్లో ఉప ఎన్నికల నేపథ్యంలోనే మంత్రులు కేంద్రం పైన విమర్శలు గుప్పిస్తున్నారన్నారు.
కరవు మండలాలను ప్రకటించక పోవడంతో రూ.230 కోట్ల సబ్సిడీ నిలిచిపోయిందన్నారు. రైతుల ఆత్మహత్యల పైన తెలంగాణ ప్రభుత్వం వద్ద సమాచారమే లేదని ఆరోపించారు.

మత అసహనంపై వెంకయ్య ఆగ్రహం
కొందరు మత అసహనం అంటూ విమర్శలు చేయడం విడ్డూరమని శనివారం కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు హైదరాబాదులో అన్నారు. హైదరాబాదులో తల్సీమా నస్రీన్ పైన దాడి జరిగినప్పుడు వీరంతా ఏమయ్యారన్నారు. దేశంలో ఎక్కడేం జరిగినా ప్రధానిదేనా బాధ్యత అని ప్రశ్నించారు. రాష్ట్రా ప్రభుత్వాల మాటేమిటన్నారు.
పరిపాలనా సౌలభ్యం, సత్వర అభివృద్ధి కోసం ఏర్పడిన ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలు దేశాభివృద్ధికి చోదకశక్తులుగా ఉండి ముందుకు వెళ్తున్నాయని వెంకయ్య అన్నారు. పరిశ్రమలు, పెట్టుబడులను ఆకర్షించడంలో తెలంగాణ-ఏపీలు పోటీ పడుతున్నాయని కొనియాడారు.
ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలు దేశ స్థూల జాతీయోత్పత్తిలో 8.17 శాతం వాటా కలిగి ఉన్నాయన్నారు. దేశవ్యాప్తంగా అన్ని రంగాల్లో తెలుగువారు కనిపిస్తున్నారన్నారు. అమెరికాలో వైద్యులు, సాఫ్టువేర్ ఇంజనీర్లలో సగం మంది భారతీయులు ఉంటే, సగం మంది తెలుగు వారే కావడం గమనార్హం అన్నారు.












Click it and Unblock the Notifications