తెలంగాణ ప్రభుత్వం భేష్, రాష్ట్రాలన్నీ సమానం: దత్తాత్రేయ, ఎప్పుడూ ఇక్కడే: తలసాని
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పైన కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ శుక్రవారం నాడు ప్రశంసలు కురిపించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల డబుల్ బెడ్రూం ఇళ్లను పైలెట్ ప్రాజెక్టుగా సికింద్రాబాద్లోని ఐడీహెచ్ కాలనీలో చేపట్టింది.
ఈ కాలనీని దత్తాత్రేయ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఇళ్లను పూర్తి చేసిన తెలంగాణ సర్కార్కు, అధికారులకు అభినందనలు అన్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన అమృత్ పథకాన్ని కొత్త ఇళ్ల నిర్మాణంతో అనుసంధానించేందుకు ప్రయత్నిస్తామన్నారు. కేంద్రానికి అన్ని రాష్ట్రాలు సమానమేనని, ఏ రాష్ట్రంపై వివక్ష లేదన్నారు.
ప్రతి ఏడాది హైదరాబాదులోనే: తలసాని
బాలల చలన చిత్రోత్సవం హైదరాబాద్లో జరగడం గర్వకారణమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఈ ఉత్సవాలు నవంబర్ 14న ప్రారంభమై నవంబర్ 20న ముగుస్తాయన్నారు.
శిల్పారామం, శిల్పకళావేదికలో ప్రారంభ, ముగింపు వేడుకలు నిర్వహిస్తామన్నారు. ఈ చలన చిత్రోత్సవాల్లో 1,204 బాలల సినిమాలను ప్రదర్శించనున్నట్లు తెలిపారు. బాలల చలన చిత్రోత్సవాలను ఏటా హైదరాబాద్లోనే నిర్వహించేలా చర్యలు తీసుకుంటామన్నారు.
గవర్నర్ను కలిసిన కెసిఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు శుక్రవారం గవర్నర్ నరసింహన్తో రాజ్భవన్లో భేటీ అయ్యారు. బతుకమ్మ ముగింపు వేడుకలకు కుటుంబ సమేతంగా హాజరు కావాలని గవర్నర్ను కేసీఆర్ ఆహ్వానించారు.
దీంతో పాటు దసరా పండుగ సందర్భంగా ఐడీహెచ్ కాలనీలో రెండు పడకగదుల ఇళ్ల ప్రారంభోత్సవ కార్యక్రమానికి గవర్నర్ను ఆహ్వానించారు. తాజా రాజకీయ పరిణామాలు చర్చకు వచ్చినట్లుగా సమాచారం.