అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ పచ్చి అబద్ధాలు: బండి సంజయ్ ఫైర్, పింఛన్ల సంగతేంటని విజయశాంతి
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ పచ్చి అబద్దాలు వల్లిస్తున్నారంటూ దుయ్యబట్టారు బండి సంజయ్. దళితబంధుపై చర్చ సందర్భంగా సుదీర్ఘ వివరణ ఇచ్చిన సీఎం కేసీఆర్ పలు అంశాలపై స్పందించిన విషయం తెలిసిందే.
అసెంబ్లీ వేదికగా కేసీఆర్ పచ్చి అబద్ధాలు
ఈ నేపథ్యంలో బండి సంజయ్ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ... ప్రధానమంత్రి, కేంద్రమంత్రులను అవమానిస్తారా? అంటూ కేసీఆర్ పై మండిపడ్డారు. సీఎం సోయిలో లేకముందే రామప్పకు యునెస్కో గుర్తింపు తెచ్చింది కేంద్రం కాదా? అని ప్రశ్నించారు. అర్హులైన వారికి పద్మశ్రీ అవార్డులిస్తూ పారదర్శకంగా వ్యవహరిస్తున్న ఘనత నరేంద్ర మోడీ ప్రభుత్వానిదేనన్నారు. ఉద్యోగాల కల్పనపైనా సీఎం మాట్లాడినవన్నీ పచ్చి అబద్దాలేనని బండి సంజయ్ అన్నారు. రాష్ట్రంలో దాదాపు 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్న మాట వాస్తవం కాదా? అని ప్రశ్నించారు బండి సంజయ్. మరో 50 వేల మంది తాత్కాలిక ఉద్యోగులను తొలగించి రోడ్డున పడేసింది నిజం కాదా? అంటూ ధ్వజమెత్తారు బండి సంజయ్. చిత్తశుద్ది ఉంటే శాఖల వారీగా ఉద్యోగ ఖాళీలపై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు బండి సంజయ్.
పింఛన్ల కోసం వృద్ధుల ఎదురుచూపులు.. అయినా పట్టని కేసీఆర్
మరో బీజేపీ నేత విజయశాంతి కూడా కేసీఆర్ సర్కారుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో కొత్త ఆసరా పెన్షన్ల అంశాన్ని ప్రభుత్వం పక్కన పెట్టింది. అర్హత గల ఎంతో మంది వృద్దులు పంచాయితీ సెక్రటరీల ద్వారా ఎంపీడీఓలకు అప్లికేషన్ పెట్టుకుని మూడేండ్లుగా ఎదురు చూస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదు. 57 ఏండ్లు నిండినోళ్లకు ఆగస్టు నుంచే ఆసరా పెన్షన్లు ఇస్తామని జులై నెలలో సిరిసిల్ల పర్యటనలో సీఎం కేసీఆర్ ప్రకటించినా.. హడావిడిగా అదే నెల 15 నుంచి 31 వరకు మీ-సేవ కేంద్రాల ద్వారా సుమారు 9.5 లక్షల దరఖాస్తులు స్వీకరించారు. కానీ.. గడువు ముగిసి నెల రోజులవుతున్నా వెరిఫికేషన్ మొదలుపెట్టలేదు. ఆగస్టులో ఇస్తామన్న పెన్షన్ అక్టోబర్లోనూ ఇచ్చే పరిస్థితి కనిపించట్లేదు. పాత లబ్ధిదారులు 37 లక్షల మందికే ప్రతి నెలా 15, 20 రోజుల ఆలస్యంగా డబ్బులిస్తున్న రాష్ట్ర సర్కార్... కొత్తగా సుమారు మరో 15 లక్షల మందికి మరో రూ.350 కోట్లు ఇవ్వడం ఇబ్బందని భావించి వాటి ఊసెత్తడం లేదని ధ్వజమెత్తారు విజయశాంతి.
Recommended Video
కొత్త పింఛన్లేవి?.. హుజూరాబాద్లో అంటే మోసగించడమే..
2018 సెప్టెంబర్లో సీఎం కేసీఆర్ ప్రభుత్వాన్ని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లినప్పటి నుంచి కొత్త పింఛన్ల మంజూరు ఆగిపోయింది. అసలు 57 ఏండ్లు నిండినోళ్లకు పెన్షన్ సంగతి పక్కనపెడితే... వితంతువులు, దివ్యాంగులు, గీత, చేనేత కార్మికులు, బోదకాలు బాధితులు, ఒంటరి మహిళలకు కూడా ప్రభుత్వం కొత్తవి మంజూరు చేయట్లేదు. అప్పట్లో 65 ఏండ్లు నిండి, ప్రస్తుతం 67, 68 ఏండ్లకు వచ్చిన వృద్ధులకూ మంజూరు చేయలేదంటే ప్రభుత్వం వృద్ధుల పట్ల ఎలాంటి వైఖరితో ఉందో ఇట్టే అర్దమవుతుంది. ప్రస్తుతం పెన్షన్ తీసుకుంటున్న వాళ్లలో వివిధ కారణాలతో నెలనెలా నాలుగైదు వేల మంది చనిపోతున్నారు. వీరి పేర్లను లబ్ధిదారుల జాబితా నుంచి తొలగిస్తున్నారు. ఇలా ఏటా 50 వేల నుంచి 60 వేల మంది చొప్పున మూడేండ్లలో సుమారు 1.70 లక్షల మందిని జాబితా నుంచి తీసేసిన ప్రభుత్వం... వీరి స్థానంలో కొత్త పెన్షన్లు మంజూరు చేయలేదు. ఈటల రాజీనామాతో హుజూరాబాద్లో ఉప ఎన్నిక షురూ కాగా... అక్కడ జులైలోనే సర్కారు కొత్త పెన్షన్లు మంజూరు చేసింది. పెండింగ్లో ఉన్న వితంతు, దివ్యాంగ, ఒంటరి మహిళలు, 50 ఏండ్లు నిండిన గీత, చేనేత కార్మికులకు పెన్షన్లు మంజూరయ్యాయి. రాష్ట్రంలోని మిగతా నియోజకవర్గాలలో వెరిఫికేషన్ పూర్తయి ఆన్లైన్లో ఉన్నా.. ప్రభుత్వం మాత్రం మంజూరు చేయడం లేదంటే కేవలం హుజురాబాద్ ఎన్నికల్లో ఓట్ల కోసం ప్రజలను మోసగించడమే తప్ప మరొకటి కాదని స్పష్టంగా అర్దమవుతుంది. ఇలా ఓట్ల కోసం టీఆర్ఎస్ సర్కార్ చేసే జిత్తులను,అబద్దాల హామీలను యావత్ తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. రానున్న రోజుల్లో తగిన బుద్ది చెబుతారని విజయశాంతి వ్యాఖ్యానించారు. .