బండి సంజయ్ విడుదల - ప్రభుత్వానికి అల్టిమేటం..!!
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ జైలు నుంచి విడుదల అయ్యారు. ప్రభుత్వం..పోలీసు అధికారుల తీరు పైన మండిపడ్డారు. ప్రభుత్వం ముందు మూడు డిమాండ్లు ఉంచారు. వాటిని అంగీకరించకుంటే ఆందోళన తప్పదని అల్టిమేటం జారీ చేసారు. తాము హిందీ పేపర్ లీక్ చేస్తే ముందు రోజు తెలుగు ప్రశ్నా పత్రం ఎవరు లీక్ చేసారని ప్రశ్నించారు. అసలు పరీక్షా కేంద్రంలో నుంచి పేపర్ ఎలా బయటకు వచ్చిందని ప్రశ్నించారు. మంత్రి కేటీఆర్ ను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేసారు. వరంగల్ లో నిరుద్యోగ యువతతో భారీ ర్యాలీ నిర్వహిస్తామని ప్రకటించారు.
జైలు నుంచి బయటకు సంజయ్ : పదో తరగతి ప్రశ్నా పత్రాల లీక్ వ్యవహారంలో అరెస్ట్ అయిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ జైలు నుంచి విడుదల అయ్యారు. సుదీర్ఘ వాదోపవాదనల తరువాత షరతులతో కోర్టు బండి సంజయ్ కు బెయిల్ మంజూరు చేసింది. ఈ రోజు కరీంనగర్ జైలు నుంచి విడుదల అయిన బండి సంజయ్ ప్రభుత్వం పైన మండిపడ్డారు. టీఎస్పీఎస్పీ లీకేజీ విషయంలో సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని సంజయ్ డిమాండ్ చేసారు. ఈ లీకేజి కారణంగా నష్టపోయిన నిరుద్యోగ యువత కు లక్ష రూపాయాల చొప్పున భృతి ఇవ్వాలన్నారు. ప్రభుత్వ తీరుతో 30 లక్షల మంది నిరుద్యోగ యువత నష్టపోయారని వివరించారు. తాను కుట్ చేయలేదని..ముఖ్యమంత్రి కుటుంబమే కుట్రలు చేస్తోందని సంజయ్ ఆరోపించారు.

సీపీ ప్రమాణం చేయాలి : ఎవరో ప్రశ్నా పత్రం ఫోన్ లో షేర్ చేస్తే తనకు ఏం సంబంధమని సంజయ్ ప్రశ్నించారు. అసలు హిందీ పేపర్ ఎవరైనా లీక్ చేస్తారా అని అడిగిన సంజయ్.. ముందు రోజు తెలుగు ప్రశ్నా పత్రం ఎవరు లీక్ చేసారో చెప్పాలన్నారు. ప్రశ్న పత్రం ఫొటో తీసి బయటకు వస్తే అక్కడ ఉన్న ఇన్విజిలేటర్లు...స్క్వాడ్ ఏం చేస్తుందని ప్రశ్నించారు. తాను చెప్పిన అన్ని అంశాలు వాస్తవాలే అని వరంగల్ సీపీ ప్రమాణం చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేసారు. ఇదంతా ప్రభుత్వం చేస్తున్న డైవర్షన్ పాలిటిక్స్ గా సంజయ్ పేర్కొన్నారు. పదో తరగతి పరీక్షా పత్రాల లీకేజీ పైన సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని డిమాండ్ చేసారు. పరీక్ష కంటే పేపర్ బయటకు వస్తే అది లీకేజీ అవుతుందని వ్యాఖ్యానించారు. తన అత్తమ్మ మరణించి ఇంట్లో అందరూ బాధలో ఉంటే, పోలీసులు దురుసుగా తనతో వ్యవహరించి తీసుకెళ్లారని బండి సంజయ్ చెప్పుకొచ్చారు.

పిచ్చోడు అంటున్నారు : ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న తనను పిచ్చోడు అంటున్నారని సంజయ్ పేర్కొన్నారు. తాను ఎంతో మందితో ఫొటోలు దిగుతూ ఉంటానని, వాళ్లందరి వివరాలు తీసుకుంటానా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ కార్యకర్త లతో ఎటువంటి పంచాయితీ లేదని సంజయ్ చెప్పుకొచ్చారు. తనకు అండగా నిలిచిన పార్టీ నేతలు, కార్యకర్తలకు ధన్యవాదాలు చెప్పారు. ప్రధాని పర్యటనను అందరం కలిసి సక్సెస్ చేద్దామని బండి సంజయ్ పిలుపునిచ్చారు. పోలీసు కమిషనర్ పైన ధిక్కరణ కేసు నమోదు చేస్తామని వెల్లడించారు. తాము సిద్దాంతం కోసం పని చేస్తామని..తెలంగాణ గడ్డ పైన కాషాయం జెండా ఎగురవేస్తామని సంజయ్ ధీమా వ్యక్తం చేసారు. సింగరేణిలో 51 శాతం వాటా రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని..ప్రయివేటీకరణ ఎవరు చేస్తారని, కేంద్రం చేస్తామంటే తాము అంగీకరించమని సంజయ్ స్పష్టం చేసారు.












Click it and Unblock the Notifications