ఆ నియోజకవర్గాల్లో బీజేపీకి అనుకూల పవనాలు; మిషన్19తో విజయం సాధించాలి: బండి సంజయ్
బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలంగాణ రాష్ట్రంలోని పరిస్థితిని చెప్పి, ప్రభుత్వంపై ప్రజల్లో వచ్చిన వ్యతిరేకతపై వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మొత్తం 19 ఎస్సీ నియోజకవర్గాలపై ఫోకస్ పెట్టిన బండి సంజయ్ ఆయా నియోజకవర్గాల పరిస్థితి, అక్కడి ప్రజల్లో ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను ఏ విధంగా బిజెపి ఓటు బ్యాంకుగా మార్చుకోవాలో హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ హోటల్లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో వెల్లడించారు. ఎస్సీ నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి పై మిషన్ 19 పేరుతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఎస్సీలకు కేసీఆర్ ఇచ్చిన హామీల అమలు కోసం పోరాట ప్రణాళిక
టిఆర్ఎస్ ప్రభుత్వం దళితులకు అనేక హామీలు ఇచ్చి విస్మరించిందని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీ నియోజకవర్గాలలో బీజేపీ సర్వే చేస్తే టిఆర్ఎస్ పార్టీపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది అని ఆయన వెల్లడించారు. ఎస్సీ నియోజక వర్గాల ప్రజల సంక్షేమం కోసం బిజెపి నాయకులు పోరాటం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్న బండి సంజయ్ దళిత బంధు అమలు, దళితులకు కేసీఆర్ ఇచ్చిన హామీల అమలు కోసం పోరాట ప్రణాళిక రూపకల్పన చేయనున్నట్టు వెల్లడించారు.

19 ఎస్సీ నియోజకవర్గాల్లో గెలుపే లక్ష్యంగా పని చెయ్యాలి
తెలంగాణలో ఉన్న మొత్తం 19 ఎస్సీ నియోజకవర్గాల్లో గెలుపే లక్ష్యంగా పార్టీ నేతలు కృషి చేయాలని అందుకు కార్యాచరణ రూపొందించినట్టు బండి సంజయ్ పేర్కొన్నారు.తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా భారతీయ జనతా పార్టీని చూస్తున్నారని పేర్కొన్నారు. దీనిని పార్టీకి అనుకూలంగా మలుచుకుని కార్యాచరణతో ముందుకు సాగాలని బండి సంజయ్ సూచించారు. ఎస్సీ నియోజకవర్గాలపై ప్రధానంగా దృష్టి సారించాలని ఎస్సీ నియోజకవర్గాలలో పార్టీ బలోపేతంపై బిజెపి నేతలు కృషిచేయాలని బండి సంజయ్ పేర్కొన్నారు.

ఎస్సీ నియోజకవర్గాల్లో సంస్థాగత నిర్మాణంపై దృష్టి
అంబేద్కర్ ఆలోచనా విధానంతో బీజేపీ ముందుకు వెళుతుందని బండి సంజయ్ స్పష్టం చేశారు. ఎస్సీ నియోజకవర్గాలలో మిషన్ 19 తో ముందుకు వెళ్లి విజయం సాధించాలని కార్యకర్తలకు బండి సంజయ్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ దళితులను ఓటు బ్యాంకుగా చూసిందని ఆరోపించారు. ఇక టిఆర్ఎస్ పార్టీ దళితులను అడుగడుగునా మోసం చేస్తుందని బండి సంజయ్ మండిపడ్డారు.బండి సంజయ్ అధ్యక్షతన 19 అసెంబ్లీ మూడు పార్లమెంటు ఎస్సీ రిజర్వుడ్ నియోజక వర్గాలలో సంస్థాగత నిర్మాణం పై దృష్టి సారించారు.

ఎస్సీ నియోజకవర్గంలో బీజేపీకి అనుకూల పవనాలు .. ఆ పని చెయ్యండి
ఇందులో భాగంగా ఎస్సీ నియోజకవర్గాలలో అభ్యర్థులను గుర్తించి, పార్టీని బలోపేతం చేసి ఎస్సీల సమస్యలపై పోరాటం చేయవలసిందిగా బండి సంజయ్ సూచించారు. ఎస్సీ నియోజకవర్గాలలో బీజేపీకి అనుకూల పవనాలు వీస్తున్నాయని, ఇక ఇదే సమయంలో స్థానిక ఎమ్మెల్యేలపై వ్యతిరేకత కూడా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది అని బండి సంజయ్ వెల్లడించారు. దళితులకు ఇచ్చిన హామీలు నెరవేర్చిన టిఆర్ఎస్ ప్రభుత్వం వైఫల్యం చెందిందని, ప్రధానంగా ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని అన్నారు.

ప్రధాని మోడీ స్పూర్తితో మిషన్ 19 లో విజయం సాధించాలి
ప్రధాని నరేంద్ర మోడీ స్ఫూర్తితో ప్రజల్లోకి వెళ్లి టిఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు. దళితుల అభ్యున్నతి కోసం ప్రధాని నరేంద్ర మోడీ కృషి చేస్తున్నారని అందుకు నిదర్శనంగా దేశ వ్యాప్తంగా 46 పార్లమెంట్ స్థానాల్లో బీజేపీ విజయం సాధించిందని బండి సంజయ్ చెప్పుకొచ్చారు. మొత్తానికి ఎస్సి నియోజకవర్గాలపై ఫోకస్ చేయాలని చెప్పిన బండి సంజయ్ మిషన్ 19 పేరుతో ప్రజల్లోకి వెళ్లి విజయం సాధించాలని స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications