విజయశాంతి 25ఏళ్ళ రాజకీయ ప్రస్థానంపై బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు
విజయశాంతి 25ఏళ్ళ రాజకీయ ప్రస్థానంపై బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. విజయశాంతికి బీజేపీనే చివరి మజిలీ అన్నారు. బీజేపీని వీడి వెళ్ళిన వారంతా తిరిగి రావాలన్నారు.
బిజెపి నాయకురాలు విజయశాంతి రాజకీయాల్లోకి అడుగుపెట్టి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో బిజెపి రాష్ట్ర కార్యాలయంలో విజయశాంతి సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విజయశాంతి రాజకీయ ప్రస్థానాన్ని కొనియాడారు.
బీజేపీనే విజయశాంతికి చివరి మజిలీ : బండి సంజయ్
విజయశాంతికి బిజెపినే చివరి మజిలీ అని పేర్కొన్న ఆయన ఆమె లక్ష్యాలు నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అంటూ వ్యాఖ్యానించారు. కెసిఆర్ వల్ల ఎందరో మోసపోయారని, కెసిఆర్ వల్ల విజయశాంతి కూడా ఇబ్బంది పడ్డారని, ఇప్పుడు ఆమెకు ఎటువంటి అడ్డంకులు లేవని తెలిపారు. బిజెపిలో ఎవరికైనా ఏ పదవి అయినా రావచ్చని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. విజయశాంతి పార్లమెంట్లో జై తెలంగాణ అని గర్జించిన మహిళ అని బండి సంజయ్ వెల్లడించారు.
ఘర్ వాపసి.. పార్టీ వీడి వెళ్ళిన వారు రావాలన్న బండి సంజయ్
ఇక ఇదే సమయంలో బిజెపి నుంచి పార్టీ మారిన నేతలను తిరిగి రావాలని కోరుతున్నానని పేర్కొన్న బండి సంజయ్ ఘర్ వాపసి అంటూ పార్టీ వీడిన నేతలందరూ తిరిగి రావాలన్నారు. జిమ్మిక్కులు చేసిన, మోసం చేసి కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారని మండిపడిన ఆయన, కెసిఆర్ పై పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు.
ఇక బిజెపి సీనియర్ నాయకురాలు విజయశాంతి మాట్లాడుతూ 25 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో బిజెపి సిద్ధాంతాలు, క్రమశిక్షణ నచ్చి 1998లో పార్టీలో చేరానని, తెలంగాణ కోసం ఏదైనా చేయాలన్న తపన తనలో ఉండేదని పేర్కొన్నారు.
కెసీఆర్ తనను నిమ్మించి మోసం చేసిన రాక్షసుడు: విజయశాంతి
సోనియా గాంధీకి పోటీగా ఉండాలని అద్వానీ చెప్పేవారని తెలిపిన ఆమె సమైక్యవాద నాయకులు తెలంగాణను అడ్డుకున్నారని, తాను శత్రువునయ్యానని వివరించారు. కేంద్ర ప్రభుత్వం కూలిపోయే పరిస్థితి వచ్చిందని తనను బ్లాక్ మెయిల్ చేశారని పేర్కొన్న విజయశాంతి, సమైక్యవాదుల ఒత్తిడి వల్ల తను బిజెపికి రాజీనామా చేసి తల్లి తెలంగాణ పార్టీ పెట్టి ఎన్నో వ్యయ ప్రయాసలను ఎదుర్కొన్నాను అన్నారు.
కేసీఆర్ తన కుట్రలతో తన పార్టీని టిఆర్ఎస్ పార్టీలో విలీనం చేసి తెలంగాణ కోసం కలిసి పని చేద్దామని నమ్మించి మోసం చేసిన రాక్షసుడని అభిప్రాయపడ్డారు.
తనను ఎంపీగా ఓడించాలని చూసాడు కేసీఆర్: విజయశాంతి
తన వ్యక్తిత్వాన్ని కించపరిచే ప్రయత్నం చేశాడని కెసిఆర్ ను ఉద్దేశించి ఆమె వ్యాఖ్యానించారు. తనని ఎంపీగా ఓడగొట్టాలని కూడా కేసీఆర్ చూశాడని విజయశాంతి పేర్కొన్నారు. కెసిఆర్ మోసాలు అర్థమయి ఆ పార్టీ నుంచి బయటకు వచ్చానని, నాడు తెలంగాణ ఇచ్చినందుకు కృతజ్ఞతగా కాంగ్రెస్లో చేరానని, ప్రస్తుతం తిరిగి తాను ఎక్కడైతే ప్రయాణం ప్రారంభించానో అదే బిజెపిలో రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నానని తెలిపారు.
విజయశాంతి పాతికేళ్ళ రాజకీయ ప్రస్తానం.. పార్టీ ఆఫీస్ లో ఘనంగా
అంతేకాదు పాతికేళ్ల తన రాజకీయ ప్రస్తానాన్ని పురస్కరించుకుని తెలంగాణ బీజేపీ వ్యవహారాల ఇంఛార్జి తరుణ్ ఛుగ్ , కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర పార్టీ అధ్యక్షులు బండి సంజయ్ , సహ పార్టీ నాయకులు, కార్యకర్తలు నన్ను గౌరవించి, నాపట్ల చూపిన ప్రేమాభిమానాలు, ఆదరణ నాకెంతో ఆనందాన్ని కలిగించాయి.
ఇంతటి ఆత్మీయతను కనబరచిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు. మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, పార్టీ రాష్ట్రఅధ్యక్షులు సంజయ్ నేతృత్వంలోతెలంగాణలో కమల వికాసం కోసం అడుగులేద్దాం అంటూ ఆమె పేర్కొన్నారు.