28 నుంచి బండి సంజయ్ ప్రజా సంగ్రామ పాదయాత్ర: 26 నుంచి బీజేపీ భరోసా యాత్ర
హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఐదో విడత ప్రజా సంగ్రామ పాదయాత్ర నవంబర్ 28న తిరిగి ప్రారంభం కానుంది. 28 నుంచి డిసెంబర్ 15 లేదా 16 వరకు పాదయాత్ర కొనసాగుతుందని ప్రజా సంగ్రామ యాత్ర సహ ప్రముఖ్ టీ వీరేందర్ గౌడ్ ఒక ప్రకటనలో వెల్లడించారు.
బాసర సరస్వతీ అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు చేసి బైంసా నుంచి బండి సంజయ్ పాదయాత్ర ప్రారంభించనున్నారు. కరీంనగర్లో ముగింపు సభ ఉంటుందని తెలిపారు. సీఎం కేసీఆర్ కుటుంబ అవినీతి, నియంత పాలనకు వ్యతిరేకంగా బండి సంజయ్ ఇప్పటికే 4 విడతల్లో పాదయాత్ర చేశారని వీరేందర్ గౌడ్ పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 21 జిల్లాల పరిధిలో 1,178 కిలోమీటర్ల నడిచినట్లు తెలిపారు.
26 నుంచి ప్రజా గోస - బీజేపీ భరోసా యాత్ర
ప్రజా సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా బీజేపీ చేపట్టిన ప్రజా గోస - బీజేపీ భరోసా యాత్ర నవంబర్ 26 నుంచి ప్రారంభం కానుంది. డిసెంబర్ 14వ తేదీ వరకు యాత్ర కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఒక్కో పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని ఒకట్రెండు అసెంబ్లీ సెగ్మెంట్లలో బైక్ ర్యాలీలు నిర్వహించనున్నారు.
మెదక్, దుబ్బాక, ఆందోల్, జహీరాబాద్, గద్వాల్, నాగర్ కర్నూల్, జడ్చర్ల, షాద్ నగర్, చేవెళ్ల, పరిగి, నల్గొండ సూర్యపేట, తుంగతుర్తి, పరకాల, వర్థన్నపేట, మహబూబాబాద్, ములుగు నియోజకవర్గాల్లో బైక్ ర్యాలీలు చేపట్టనున్నారు.
ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 200 బైక్ లతో ర్యాలీ నిర్వహించనున్నారు. 10 నుంచి 15 రోజుల పాటు బైక్ ర్యాలీలు కొనసాగనున్నాయి. నిత్యం నియోజకవర్గంలోని ఓ గ్రామంలో కార్నర్ మీటింగ్ నిర్వహించి స్థానిక సమస్యల గురించి నేతలు తెలుసుకోనున్నారని యాత్ర ఇంఛార్జ్ కాసం వెంకటేశ్వర్లు వెల్లడించారు.