బండి సంజయ్ ప్రజాసంగ్రామ యాత్ర ప్రారంభం: షర్మిలపై దాడి ఖండన, రేపే భైంసా సభ
నిర్మల్: హైకోర్టు షరతులతో కూడిన అనుమతి ఇవ్వడంతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర సోమవారం సాయత్రం ప్రారంభమైంది. భైంసాలోకి వెళ్లకుండా పాదయాత్ర కొనసాగించాలన్న కోర్టు.. ఇతర మతాలకు సంబంధించి ఎలాంటి విద్వేషపూరిత వ్యాఖ్యలు, నినాదాలు చేయరాదని పేర్కొంది. సాయంత్రం 5 గంటల వరకు సభ నిర్వహించుకోవాలని షరతు విధించింది.
ఈ నేపథ్యంలో కరీంనగర్ నుంచి నిర్మల్కు చేరుకున్న బండి సంజయ్కి నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. సారంగాపూర్ మండలం అడెల్లి పోచమ్మ గుడిలో సంజయ్ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆడెల్లి పోచమ్మ ఆలయం నుంచే బండి సంజయ్ ఐదో ప్రజాసంగ్రామ యాత్రను ప్రారంభించారు.
ఈ సందర్బంగా సీఎం కేసీఆర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతియుతంగా చేసుకుంటున్న తమ యాత్ర, సభలను ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. భైంసా ఏమైనా నిషేధిత ప్రాంతమా? అని నిలదీశారు. భైంసానే కాపాడలేని సీఎం.. రాష్ట్రాన్ని ఏం కాపాడతారని ప్రశ్నించారు. ప్రజలకు రక్షణ కల్పించలేని సీఎం ఇంట్లో కూర్చోవాలని మండిపడ్డారు.
That's a cheerful welcome at Perkit, as always, and a ride by Indur MP Shri @Arvindharmapuri garu enroute to #PrajaSangramaYatra5. pic.twitter.com/HBGjsY4yA0
— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) November 28, 2022
మరోవైపు, వైయస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిలపై టీఆర్ఎస్ శ్రేణుల దాడిని ఖండించారు బండి సంజయ్. ఒక మహిళ పాదయాత్ర చేస్తుంటే దాడులు చేస్తారా? అని మండిపడ్డారు. అసలు ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా? అని సంజయ్ ప్రశ్నించారు.
రేపు భైంసాలోనే బీజేపీ బహిరంగ సభ
భైంసాలోని పార్టీ వై జంక్షన్ వద్ద యధావిధిగా బీజేపీ బహిరంగ నిర్వహించనుంది. మంగళవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సభ నిర్వహించనున్నారు. బహిరంగ సభ అనంతరం 2వ రోజు ప్రజా సంగ్రామ యాత్రను కొనసాగించనున్నారు బండి సంజయ్.