బండి సంజయ్ ప్రజాసంగ్రామ యాత్ర-3 షెడ్యూల్ ఇదే.. యాదాద్రిలో ప్రారంభం; 12నియోజకవర్గాలలో పాదయాత్ర
తెలంగాణ రాష్ట్రంలో కాషాయ జెండా ఎగరవెయ్యాలన్న లక్ష్యంతో, టిఆర్ఎస్ పార్టీపై సమర శంఖం పూరిస్తుంది బీజేపీ. ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకొని, ప్రజల ఆదరణ పొందడానికి ప్రయత్నం చేస్తున్న బీజేపీ పాదయాత్ర పేరుతో ప్రజాక్షేత్రంలో కేసీఆర్ సర్కార్ తీరును ఎండగడుతుంది. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నేరుగా రంగంలోకి దిగి పాదయాత్ర సాగిస్తున్నారు. తాజాగా మరోమారు ప్రజా సంగ్రామ యాత్ర మూడో విడతకు శ్రీకారం చుట్టారు.

మూడో విడత ప్రజా సంగ్రామ పాదయాత్రకు బండి సంజయ్
తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ని గద్దె దించడానికి తెలంగాణ బిజెపి రథసారథి గా బండి సంజయ్ వ్యూహాత్మకంగా ముందుకు వెళుతున్నాడు. ప్రజాక్షేత్రంలోకి వెళ్లి బీజేపీని క్షేత్రస్థాయిలోకి తీసుకువెళ్లాలని, ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేయాలని అనేక కార్యక్రమాలను ప్రారంభించారు. కేసీఆర్ సర్కార్ వైఫల్యాలను ఎండగట్టాలని నిర్ణయం తీసుకున్న బండి సంజయ్ ఇప్పటికే గ్రామగ్రామాన బైక్ ర్యాలీలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు మళ్ళీ మూడో విడత ప్రజా సంగ్రామ పాదయాత్ర చేపట్టనున్నారు.

షెడ్యూల్ ఇదే.. యాదాద్రి నుండి భద్రకాళీ ఆలయం వరకు బండి సంజయ్ పాదయాత్ర
ఆగస్టు 2వ తేదీ నుంచి 26వ తేదీ వరకు మూడో విడత ప్రజా సంగ్రామ యాత్రను బండి సంజయ్ కొనసాగించనున్నారు. యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం నుండి ప్రారంభమయ్యే ఈ యాత్ర హనుమకొండ భద్రకాళి అమ్మవారి ఆలయం వరకు కొనసాగుతుంది. ఇక బండి సంజయ్ పాదయాత్ర కు సంబంధించిన షెడ్యూల్ వివరాల్లోకి వెళితే మొత్తం ఇరవై నాలుగు రోజుల పాటు యాదాద్రి, నల్గొండ, జనగామ, వరంగల్, హన్మకొండ జిల్లాల మీదుగా 12 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 మండలాలలో మూడో విడత పాదయాత్ర కొనసాగనుంది. మొత్తం 328 కిలోమీటర్ల మేర మూడో విడత పాదయాత్ర కొనసాగుతుంది.

చారిత్రక ప్రదేశాల గుండా సాగనున్న పాదయాత్ర
ఇక పాదయాత్ర ఆలేరు, భువనగిరి, మునుగోడు, నకిరేకల్, తుంగతుర్తి, పాలకుర్తి, జనగామ, స్టేషన్ ఘన్పూర్, వర్ధన్నపేట, పరకాల, వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ నియోజకవర్గాల మీదుగా సాగుతుందని బిజెపి పర్యటన షెడ్యూల్ ను విడుదల చేసింది. ఇక తెలంగాణ రాష్ట్రంలోని ఎన్నో చారిత్రాత్మక ప్రదేశాల గుండా మూడో విడత పాదయాత్ర సాగనుంది. చేనేతకు ప్రసిద్ధిగాంచిన పోచంపల్లి, చాకలి ఐలమ్మ పోరు సాగించిన విస్నూరు, రజాకార్ల అరాచకాలకు బలైన గుండ్రాంపల్లి, సర్దార్ సర్వాయి పాపన్న పరిపాలన సాగించిన ఖిలాషాపూర్, కొత్తపేట, అయినవోలు మల్లన్న ఆలయం, వరంగల్ కోట తదితర ప్రదేశాల మీదుగా బండి సంజయ్ పాదయాత్ర కొనసాగుతుంది.

ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగరవెయ్యటం లక్ష్యంగా బండి సంజయ్ పాదయాత్ర
అనేక గిరిజన తండాలను తాకుతూ మూడవ విడత పాదయాత్ర కొనసాగనుంది.ఇప్పటికే బండి సంజయ్ రెండు పాదయాత్రలను విజయవంతంగా పూర్తి చేశారు. ఇప్పుడు మూడో విడత పాదయాత్రను కూడా సక్సెస్ చేయడం కోసం పార్టీ శ్రేణులు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. బీజేపీ జెండాని ప్రజల్లోకి తీసుకు వెళ్లడంతో పాటు, పార్టీ శ్రేణులకు నూతనోత్సాహాన్ని ఇవ్వడం, అలాగే టిఆర్ఎస్ పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజాక్షేత్రంలో ఎండగట్టడానికి బండి సంజయ్ రంగంలోకి దిగుతున్నారు.

2024 ఎన్నికలే లక్ష్యంగా.. ప్రజా సంగ్రామ యాత్ర, మూడో విడత షెడ్యూల్ రెడీ
బండి సంజయ్ గత ఏడాది ఆగస్ట్ 28వ తేదీన చార్మినార్ భాగ్యలక్ష్మి దేవాలయం నుంచి పాదయాత్ర ప్రారంభించి, నాలుగు ఐదు విడతలుగా రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర నిర్వహించాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. మొదటి విడత పాదయాత్ర హుస్నాబాద్ లో ముగిసింది. బండి సంజయ్ మొదటి విడత పాదయాత్రలో 438 కిలోమీటర్ల మేర నడిచారు. ఇక రెండో విడత ఏప్రిల్ 14న ఆలంపూర్ జోగులాంబ ఆలయం నుండి ప్రారంభమై మే 14న తుక్కుగూడ లో బహిరంగ సభ ను నిర్వహించడం ద్వారా ముగిసింది. ఇప్పుడు ఆగస్ట్ 2 నుండి మూడో విడతకు రూట్ మ్యాప్ సిద్ధం అయ్యింది.












Click it and Unblock the Notifications