భైంసా అల్లర్లు... అంతా ప్లాన్ ప్రకారమే... సీఎం కేసీఆర్ ఎందుకు స్పందించట్లేదు : బండి సంజయ్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటనే భైంసాను సందర్శించి బాధితులను పరామర్శించాలని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి వెళ్లకపోతే తానే వెళ్తానని అన్నారు. ఎన్నికల తర్వాత కచ్చితంగా భైంసాలో భరోసా యాత్ర చేపడుతానని... బాధితులకు భరోసా ఇస్తానని చెప్పారు. ఒక్కో యువకుడిపై పదుల సంఖ్యలో కేసులు పెడుతున్నారని ఆరోపించారు. భైంసాలో అరెస్టయిన యువకులను వెంటనే విడిచి పెట్టాలని... ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. భైంసాలో ఉన్న హిందూ సమాజానికి తాము అండగా నిలబడుతామని స్పష్టం చేశారు.
కేసీఆర్ ఎందుకు స్పందించట్లేదు : బండి సంజయ్
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నవారి పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని చెప్పారు. బీజేపీ కార్యకర్తలు సకాలంలో వారిని ఆస్పత్రికి చేర్చడం వల్లే ప్రాణాపాయం తప్పిందన్నారు. వారిని,వారి కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని చెప్పారు. సేవా భారతి ట్రస్ట్ నుంచి వారికి సహాయం అందిస్తామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ఘటనపై ఎందుకు స్పందించట్లేదని ప్రశ్నించారు. ఇకనైనా మానవతా దృక్పథంతో ఆలోచించాలని... ఓట్ల కోసం,సీట్ల కోసం ఆలోచిస్తే ప్రజలు తిరగబడుతారని హెచ్చరించారు. స్థానిక ఎంపీ సోయం బాపురావును సైతం భైంసాలో అడుగుపెట్టనివ్వకుండా అడ్డుకోవడమేంటని ప్రశ్నించారు.
ప్లాన్ ప్రకారమే జరిగింది : సంజయ్
భైంసా ఘటనలో పోలీసులు వారి విధులు నిర్వర్తించకుండా అధికార పార్టీ నేతలు ఒత్తిడి తెస్తున్నారని సంజయ్ ఆరోపించారు. ఘటనపై ఇప్పటివరకూ రాష్ట్ర ప్రభుత్వం,అధికారులు స్పందించలేదన్నారు. భైంసాలో ప్రత్యేక చట్టం ఏమైనా అమలుచేస్తున్నారా అని ప్రశ్నించారు. పేదల ఇళ్లు దగ్ధం చేసినా.. ఆరు ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు జరిగినా సీఎం ఎందుకు స్పందించట్లేదన్నారు. ఇవన్నీ ఒక పథకం ప్రకారమే జరిగాయని ఆరోపించారు.అన్ని వర్గాలను సమదృష్టితో చూడాల్సిన ప్రభుత్వం పక్షపాత వైఖరిని అవలంభిస్తోందని సంజయ్ విమర్శించారు.
అల్లర్లతో మళ్లీ అట్టుడికిన భైంసా
ఈ నెల 7వ తేదీ రాత్రి భైంసా పట్టణంలో అల్లర్లు చెలరేగిన సంగతి తెలిసిందే. కొందరు యువకులు సైలెన్సర్లు తీసేసిన బైకుపై పెద్ద శబ్దం చేసుకుంటూ జుల్ఫికర్ కాలనీలో తిరగడమే ఈ అల్లర్లకు దారితీసినట్లుగా చెప్తున్నారు. జుల్ఫీకర్ గల్లి,కుభీరు రహదారి,గణేశ్ నగర్,మేదరి గల్లి ప్రాంతాల్లో రెండు వర్గాలు పరస్పరం రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఈ అల్లర్లలో విజయ్ అనే ఓ రిపోర్టర్ కత్తిపోట్లకు గురయ్యాడు. మరో రిపోర్టర్,ఎస్సై,కానిస్టేబుల్ కూడా గాయపడ్డారు. పలు వాహనాలకు నిప్పంటించడంతో అవి దగ్ధమయ్యాయి. గాయపడినవారు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.