కర్ణాకటలో బీజేపీ ఓటు బ్యాంక్ చెక్కు చెదరలేదు: కేసీఆర్ పెద్దన్న పాత్రంటూ బండి సంజయ్
హైదరాబాద్: కర్ణాటకలో అన్ని పార్టీలు కలిసి బీజేపీని ఓడించాయని అన్నారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. కరీంనగర్లో మీడియాతో మాట్లాడుతూ.. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై స్పందించారు. కాంగ్రెస్ ఒక్క రాష్ట్రంలో గెలవగానే ఇంతలా రెచ్చిపోతున్నారని.. బీజేపీ 18 రాష్ట్రాల్లో అధికారంలో ఉందన్నారు. కర్ణాటకలో ఓడినా.. బీజేపీ ఓటు బ్యాంకు ఎక్కడా చెక్కు చెదరలేదన్నారు.
ఒక రాష్ట్రంలో వచ్చిన ఫలితాల ప్రభావం మరో రాష్ట్రంపై ఉంటుందనుకోవడం సరికాదన్నారు బండి సంజయ్. గత ఎన్నికల్లో బీజేపీకి 36 శాతం ఓట్లు వచ్చాయని.. ఈసారి కూడా 36 శాతం ఓట్లు పోలయ్యాయని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఓటింగ్ 38 నుంచి 43 శాతానికి పెరిగిందన్నారు. జేడీఎస్ ఓటింగ్ షేర్ 20 నుంచి 13 శాతానికి తగ్గిందని చెప్పారు.

అన్ని పార్టీలు కలిసి బీజేపీని ఎదుర్కొన్నాయి. కర్ణాటకలో మత రాజకీయాలు చేసింది కాంగ్రెస్ పార్టీనే. ఆ పార్టీకి మద్దతిచ్చిన కేసీఆర్.. కర్ణాటకలో పెద్దన్న పోషించారు. కాంగ్రెస్ పార్టీ ఒక వర్గం ఓట్లతో గెలిచింది. ఎస్డీపీఐ, ఎంఐఎంలు కలిసి కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేశాయి. తెలంగాణలో ఐదు ఉపఎన్నికలు జరిగితే రెండింటిలో బీజేపీ గెలిచింది. మనుగుగోడులో కూడా మేమే గెలిచినట్లు లెక్క.. కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ కూడా రాలేదు అని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.
కర్ణాటకలో 4 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని మత రాజకీయాలు చేసిందెవరని ప్రశ్నించారు బండి సంజయ్. ఫక్తు మత రాజకీయాలు చేసింది కాంగ్రెస్సేనని విమర్శించారు. కర్ణాటక రాజకీయాలు తెలంగాణలో పనిచేయబోవన్నారు. ఒక్క రాష్ట్రంలో గెలవగానే కేంద్రంలో అధికారంలోకి వస్తారా అని ప్రశ్నించారు బండి సంజయ్.
తెలంగాణలో ప్రత్యామ్నాయం బీజేపేనని స్పష్టం చేశారు. కేసీఆర్కు తెల్వకుండా హైదరాబాద్ లో క్యాంప్ రాజకీయాలు జరుగుతాయా? అని ప్రశ్నించారు. దమ్ముంటే కర్ణాటకలో ప్రకటించినట్లుగా నాలుగు శాతం రిజర్వేషన్ సహా భజరంగ్ దళ్ను నిషేధిస్తామని తెలంగాణలో చెప్పగలరా? అని కేసీఆర్ సవాల్ విసిరారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ , బీఆర్ఎస్ కలిసి పోటీ చేస్తాయన్నారు బండి సంజయ్.












Click it and Unblock the Notifications