హేయమైన చర్య: కేసీఆర్ సర్కారుపై బండి సంజయ్ ఫైర్, రేపు ఇందిరాపార్క్ వద్ద భారీ నిరసన
హైదరాబాద్: సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వంపై మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. బీజేపీ ఎమ్మెల్యేలను శాసనసభలోకి అనుమతించే అంశాన్ని పరిశీలించాలన్న హైకోర్టు సూచనలను స్పీకర్ తిరస్కరించడాన్ని నిరసిస్తూ గురువారం ఇందిరాపార్క్ వద్ద ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్ష చేపట్టనున్నట్లు తెలిపారు.

కేసీఆర్ సర్కాకు వ్యతిరేకంగా రేపు బీజేపీ నిరసన దీక్ష
గురువారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇందిరాపార్క్ వద్ద ఈ దీక్ష చేపట్టనున్నట్లు బండి సంజయ్ చెప్పారు. ఎమ్మెల్యేలు రాజా సింగ్, ఈటల రాజేందర్, రఘునందన్ రావు, ఎంపీలు సోయం బాపురావు, ధర్మపురి అరవింద్, పార్టీ సీనియర్ నేతలు దీక్షలో పాల్గొంటారని బుధవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో వెల్లడించారు బండి సంజయ్.

అత్యంత హేయమైన చర్య: కేసీఆర్ సర్కారుపై బండి సంజయ్
కేసీఆర్ ప్రభుత్వం రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని మంటగలుపుతోందనడానికికి, పార్లమెంటరీ సంప్రదాయాలను తుంగలో తొక్కుతుందనేందుకు బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షనే నిదర్శనమని బండి సంజయ్ అన్నారు. స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని సరిదిద్దుకొని ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడాలంటూ హైకోర్టు సూచించినప్పటికీ.. పెడచెవిన పెట్టడం అత్యంత హేయమైన చర్యగా అభిప్రాయపడ్డారు. రాజ్యాంగబద్ధంగా, నిష్పాపక్షికంగా వ్యవహరించాల్సిన స్పీకర్ టీఆర్ఎస్ కు అనుకూలంగా వ్యవహరించడం ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు లాంటిదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో మంటగలిసిన రాజ్యాంగ, ప్రజాస్వామ్య విలువలను పరిరక్షిచేందుకు బీజేపీ చేపడుతున్న ఈ దీక్షకు ప్రజాస్వామ్యవాదులు, మేధావులు, విద్యావేత్తలతోపాటు ప్రజా సంఘాల నాయకులు మద్దతు పలకాలని బండి సంజయ్ కోరారు.

కేసీఆర్ కోతల మాటలు, అబద్ధాలు తెలంగాణ ప్రజలకు కొత్తేం కాదు
ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి తీవ్రంగా మండిపడ్డారు. కేసీఆర్ కోతల మాటలు తెలంగాణ ప్రజలకు కొత్తేం కాదన్నారు. అధికారంలోకి వచ్చేందుకు ఎన్నికలప్పుడు ఎన్నో అబద్ధాలు చెప్పారని.. ఇప్పుడు కూడా అవే అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. టీఆర్ఎస్ పాలనలో తెలంగాణలో ఏ వర్గానికి సరైన న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో కేసీఆర్ చెప్పే అబద్ధాల మాటలు విని ప్రజలు విసిగిపోయారన్నారు. టీఆర్ఎస్ను ఓడించేందుకు సమయం దగ్గర పడిందని అందరూ అనుకుంటున్నారని చెప్పారు వివేక్ వెంకటస్వామి.












Click it and Unblock the Notifications