ఎంపీ అరవింద్ ఇంటికి బండి సంజయ్: ఆ రెండింటిలోనూ కేసీఆర్ విఫలమంటూ ఫైర్
హైదరాబాద్: టీఆర్ఎస్ నేతల దాడి నేపథ్యంలో బంజారాహిల్స్లోని ఎంపీ ధర్మపురి అరవింద్ నివాసాన్ని పరిశీలించారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్. పోలీసుల కనుసన్నల్లోనే విచక్షణ రహితంగా టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు ఎంపీ అరవింద్ ఇంటిపై దాడి చేశారని బండి సంజయ్ ఆరోపించారు.
విమర్శిస్తే దాడులు చేస్తారా?: బండి సంజయ్
దాడికి సంబంధించిన సమాచారాన్ని అరవింద్ను అడిగి తెలుసుకున్నారు బండి సంజయ్. దాడి చేసిన వారు ఎందుకు చేయాల్సి వచ్చిందో అర్థం కావడం లేదన్నారు. దాడి చేసిన వారు ఇంట్లోని ఫర్నీచర్ తోపాటు దేవుళ్ల చిత్రపటాలపై దాడి చేశారని మండిపడ్డారు. కేసీఆర్ కుటుంబ అహంకారాన్ని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. ప్రజాస్వామ్యంలో విమర్శలకు ప్రతి విమర్శలు చేయాలి కానీ.. దాడి చేస్తారా? అని బండి సంజయ్ ప్రశ్నించారు. ఇళ్లపై దాడులు చేయడం మంచిది కాదన్నారు. కుటుంబసభ్యులకు రాజకీయాలతో సంబంధం ఏంటని ప్రశ్నించారు.
కేసీఆర్ సొంత బిడ్డను పావుగా వాడుకుంటున్నారన్న బండి
రాజకీయల కోసం కేసీఆర్ సొంత బిడ్డను పావుగా వాడుకుంటున్నారని బండి సంజయ్ ఆరోపించారు. కేసీఆర్ కుటుంబాన్ని తెలంగాణ పొలిమెర నుంచి తరిమికొట్టేందుకు ఎన్నికలు ఎప్పుడు వస్తాయా? అని ప్రజలు ఎదురుచూస్తున్నారని బండి సంజయ్ అన్నారు. సీఎం కేసీఆర్ తక్షణమే ఘటనపై స్పందించాలని డిమాండ్ చేశారు. దాడితో సంబంధం ఉన్న సంబంధిత పోలీసు అధికారులపైనా చర్యలు తీసుకోవాలన్నారు.
సీఎంగా, తండ్రిగా కేసీఆర్ విఫలమంటూ బండి సంజయ్
కేసీఆర్ కుటుంబంలో అంతర్గత ఘర్షణలు ప్రారంభమయ్యాయి. కేసీఆర్ ముఖ్యమంత్రిగా, తండ్రిగా విఫలమయ్యారని బండి సంజయ్ అన్నారు. దాడి జరిగిన సమయంలో అరవింద్ తండ్రి అదృష్టవశాత్తూ ఇక్కడ లేరని, ఉంటే పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. హోమో ఫోబియాలో కేసీఆర్ కుటుంబం ఉందని, పోయే కాలం దగ్గరపడిందన్నారు. హిందువులు పవిత్రంగా కొలిచే లక్ష్మి, తులసి, దుర్గదేవీల ఫొటోల మీద దాడి చేశారన్నారు. హిందువులు అయితే దేవుళ్ల ఫొటోలపై దాడి చేయరని అన్నారు. దేవుళ్ల మీద దాడి చేసినందుకు కేసీఆర్ క్షేమాపణ చెప్పాలన్నారు.