జల వివాదంపై కేంద్రానికి బండి లేఖ : కేసీఆరే కారణం-ఇద్దరు సీఎంలు సెంటిమెంట్ రెచ్చగొడుతున్నారంటూ..
తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదంపై నిన్న మొన్నటిదాకా మౌనం వహించిన తెలంగాణ బీజేపీ ఎట్టకేలకు స్పందించింది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఈ వివాదంపై కేంద్రానికి లేఖ రాశారు. కృష్ణా రివర్ బోర్డు పరిధిని ఖరారు చేసి తెలంగాణ చట్టబద్ధమైన హక్కులను కాపాడాలని కోరారు.
తెలంగాణ సీఎం కేసీఆర్,ఏపీ సీఎం జగన్ ఇద్దరూ కలిసి జల వివాదం సృష్టిస్తున్నారని... సెంటిమెంటును రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ ప్రయోజనాలను విస్మరించిన కేసీఆర్ ఏపీ అక్రమ ప్రాజెక్టులను అడ్డుకునే ప్రయత్నం చేయలేదన్నారు.ఈ మేరకు కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్కు ఆయన లేఖ రాశారు.

తెలంగాణకు కేసీఆర్ ద్రోహం... : బండి సంజయ్
కృష్ణా నదిపై ఏపీ అక్రమ ప్రాజెక్టులకు కేసీఆరే కారణమని బండి సంజయ్ ఆరోపించారు. అక్రమ ప్రాజెక్టుల నిర్మాణానికి ఏపీ అవకాశం ఇచ్చి తెలంగాణకు తీరని ద్రోహం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయలసీమ ఎత్తిపోతల పథకానికి ఏపీ ప్రభుత్వం టెండర్లు పిలిస్తే... దానికి అడ్డంకులు సృష్టించకుండా ఉండేందుకే రెండో అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని కేసీఆర్ వాయిదా వేయించారని ఆరోపించారు.
కృష్ణా జలాల్లో తెలంగాణకు న్యాయంగా దక్కాల్సిన వాటాను కాపాడుకోవడంలో కేసీఆర్ విఫలమయ్యారని ఆరోపించారు. అటు జగన్కు,ఇటు కేసీఆర్కు... ఇద్దరికీ రాష్ట్ర ప్రయోజనాలపై పట్టింపు లేదన్నారు. కేవలం రాజకీయ లబ్ది కోసమే ఇదంతా చేస్తున్నారని ఆరోపించారు. కృష్ణా జలాల్లో తెలంగాణ హక్కులు కాపాడాలంటే తక్షణమే కేఆర్ఎంబీ పరిధిని నోటిఫై చేయాలని బండి సంజయ్ కోరారు.
తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీసేలా...
ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం కృష్ణా,గోదావరి నదీ యాజమాన్య బోర్డుల పరిధిని నోటిఫై చేయాలని సంజయ్ కోరారు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణకు 811 టీఎంసీల నీటి కేటాయింపులు జరిగితే... కేవలం 299 టీఎంసీల నీటిని మాత్రమే వాడుకునేందుకు కేసీఆర్ అంగీకరించారని... తద్వారా తెలంగాణ ప్రయోజనాలను కాలరాశారని ఆరోపించారు. తెలంగాణలో కృష్ణా నది పరివాహక ప్రాంతం 68.5శాతం ఉంటుందన్న సంజయ్... ఈ లెక్కన రాష్ట్రానికి 555 టీఎంసీల నీళ్లు దక్కాలన్నారు.

ఏపీ ప్రాజెక్టులు అక్రమం...
ఏపీ ప్రభుత్వం నిబంధనలను ఉల్లంఘిస్తూ రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు,పోతిరెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును నిర్మిస్తోందని బండి సంజయ్ ఆరోపించారు. కొత్త ప్రాజెక్టులకు అపెక్స్ కౌన్సిల్,నదీ యాజమాన్య బోర్డుల అనుమతి తప్పనిసరి అని విభజన చట్టంలో పేర్కొన్న విషయాన్ని గుర్తుచేశారు. రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాన్ని పరిష్కరించేందుకు కేంద్రం,అపెక్స్ కౌన్సిల్ చేస్తున్న ప్రయత్నాలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు.

కేసీఆర్ స్టాండ్ ఇదీ...
మరోవైపు ఆంధ్రప్రదేశ్తో నెలకొన్న జల వివాదంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి తన వైఖరిని కుండబద్దలు కొట్టారు. కృష్ణా నదిపై ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ముమ్మాటికీ అక్రమమేనని తేల్చి చెప్పారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు సగం వాటా దక్కాల్సిందేనని అన్నారు. 811 టీఎంసీల నికర జలాల్లో ఇరు రాష్ట్రాలకు 405.5టీఎంసీల చొప్పున నీటి పంపిణీ జరగాలన్నారు.
పర్యావరణ అనుమతులు లేకపోయినా,ఎన్జీటీ స్టే ఇచ్చినా ఏపీ ప్రభుత్వం రాయలసీమ లిఫ్ట్ను నిర్మించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు న్యాయంగా దక్కాల్సిన వాటాపై రాజీ లేని పోరాటం చేస్తామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఏపీ నిర్మిస్తున్న రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం గుర్తించే ప్రసక్తే లేదన్నారు. ఒక్క చుక్క నీటి కేటాయింపులు లేకపోయినప్పటికీ... సరైన అనుమతులు కూడా లేకుండా ఏపీ ప్రభుత్వం ప్రాజెక్టును నిర్మించడం సరికాదన్నారు.












Click it and Unblock the Notifications