కెసిఆర్ ఎఫెక్ట్-చారిత్రక పొత్తు!: రేవంత్ రెడ్డికి 'సై' వెనుక ఆ భయమా?
తెలంగాణ తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలలోని పలువురు నేతలు ఇటీవల ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. సీఎం కేసీఆర్కు వ్యతిరేకంగా అవసరమైతే టిడిపి, కాంగ్రెస్ పార్టీలు ఒక్కటి కావాలని భావిస్తున్నాయి.
హైదరాబాద్: తెలంగాణ తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలలోని పలువురు నేతలు ఇటీవల ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. సీఎం కేసీఆర్కు వ్యతిరేకంగా అవసరమైతే టిడిపి, కాంగ్రెస్ పార్టీలు ఒక్కటి కావాలని భావిస్తున్నాయి.
ఈ ప్రతిపాదన అటు తెలుగుదేశం నేతలు, ఇటు కాంగ్రెస్ నేతల నుంచి రావడం గమనార్హం. ఇక్కడ మరో ఆసక్తికర కోణం కూడా ఉంది. ఇరు పార్టీల్లోని రెడ్డి సామాజిక వర్గం నేతలే పొత్తు గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు.
రేవంత్ ప్రతిపాదన.. కాంగ్రెస్ సుముఖత
టిడిపి నుంచి ఆ పార్టీ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి తొలుత ఈ ప్రతిపాదన తెరపైకి తీసుకు వచ్చారు. అవసరమైతే కాంగ్రెస్ పార్టీతో కలిసి పని చేస్తామని చెప్పారు.
దానికి కాంగ్రెస్ పార్టీ నేతలు జానా రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిల నుంచి కూడా సానుకూల స్పందన వచ్చింది. ఆ పరిస్థితి వస్తే నిర్ణయం తీసుకుంటామని అభిప్రాయపడ్డారు.
వారే ఎక్కువ మాట్లాడుతున్నారు
రేవంత్ రెడ్డి, జానా రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి వంటి నాయకులే వీటి గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు. అసలు టిడిపి పుట్టిందే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా. అలాంటి పార్టీతో కలిసి పని చేసేందుకు సిద్ధమని రేవంత్ రెడ్డి చెప్పడం, దానికి కాంగ్రెస్ సరేననడం గమనార్హం. అదే జరిగితే ఇది తెలుగు రాజకీయ చరిత్రలో ఓ చారిత్రక పొత్తు అవుతుందని చెప్పవచ్చు.
వారి ఆందోళన
కొద్ది రోజుల క్రితం హైదరాబాదులో రెడ్డిల సభ జరిగింది. విభజన అనంతరం రెడ్డిలను అణగదొక్కే ప్రయత్నాలు జరుగుతున్నాయని, వారికి గతంలో ఉన్న ప్రాధాన్యత ఉండడం లేదని వక్తలు అభిప్రాయపడ్డారు.
విభజన, తదనంతర పరిణామాల నేపథ్యంలోనే ఇరు పార్టీల్లోని ఆ సామాజిక వర్గం నాయకులు కాంగ్రెస్ - టిడిపి పొత్తు అంశాన్ని తెరపైకి తెచ్చి ఉంటారనే వాదనలు వినిపిస్తున్నాయి.
పొత్తు ప్రతిపాదన వెనుక కారణాలు
పొత్తు ప్రతిపాదన వెనుక ఎన్నో కారణాలున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విభజన అనంతరం తెలంగాణలో తమ సామాజిక వర్గాన్ని రాజకీయంగా దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలు సందర్భాల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఈ మాటలు వినిపించాయి.
కేసీఆర్ను ధీటుగా ఎదుర్కొనేందుకు..
ఇక, ఇటీవలే కోమటిరెడ్డి వెంకట రెడ్డిని లక్ష్యంగా చేసుకొని దాడి జరిగింది. రాజకీయంగా పలుకుబడి తగ్గుతోంది. మొత్తంగా వ్యూహంతో ముందుకు వెళ్లకుంటే తమ సామాజిక వర్గ ప్రయోజనాలే దెబ్బతింటాయనే ఆలోచనలో వారు ఉన్నారని అంటున్నారు.
కేసీఆర్ను ధీటుగా ఎదుర్కోవాలన్నా, తమ రాజకీయంగా తమకు ప్రాధాన్యం తిరిగి దక్కాలన్నా.. వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లాలనే ఉద్దేశ్యంలో భాగంగానే పొత్తును తెరపైకి తెచ్చారని అంటున్నారు.