భరత్ రెడ్డి దాష్టీకం: దొరల రాజ్యం ఓ కట్టుకథ, బాధితులను వేసుకొని...
నిజామాబాద్: దళితులను అవమానించిన కేసులో బీజేపీ మాజీ నాయకుడు భరత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి సోమవారం మీడియా ముందు ప్రవేశ పెట్టారు. మీడియా ప్రతినిధుల సమావేశంలో నిజామాబాద్ సీపీ కార్తికేయ వివరాలు వెల్లడించారు.
దొరల రాజ్యం సినిమా ఒక కట్టుకథ అని తేల్చారు. అక్రమంగా మొరం తరలిస్తున్నందుకే అభంగపట్నం దళితులు లక్ష్మణ్, రాజేశ్వర్లను భరత్ రెడ్డి అవమానించాడని పేర్కొన్నారు. విషయం బయటకు పొక్కేసరికి సినిమా షూటింగ్ అని కొత్త నాటకానికి తెరలేపాడని వెల్లడించారు.

బాధితులను వేసుకుని ఇలా..
పోలీసులకు దొరక్కుండా హైదరాబాద్, జోగులాంబ, హంపి, కడప ప్రాంతాల్లో బాధితులను వెంట వేసుకొని తిప్పాడని చెప్పారు. భరత్ రెడ్డిని కోర్టులో ప్రవేశ పెడతామని, మరింత విచారణ కోసం కస్టడీ కోరతామని తెలిపారు. అభంగపట్నంలో పికెటింగ్ కొనసాగిస్తామని, అవసరం అయితే మరింత పెంచుతామని సీపీ వెల్లడించారు.

నెల రోజుల తర్వాత అరెస్టు
నెల రోజులుగా అతడి కోసం గాలిస్తున్న పోలీసులు ఎట్టకేలకు హైదరాబాద్లో అరెస్టు చేశారు. నిజామాబాద్ జిల్లాలోని నవీపేట మండలం అభంగపట్నంలో అక్రమంగా మొరం మట్టిని తరలిస్తున్నారని ఇద్దరు స్థానికులు అడ్డుకోగా దాడి చేసిన భరత్రెడ్డి వారిని నీటికుంటలో మునగాల్సిందిగా ఆదేశించాడు.

ఇటీవలే బాధితులు స్వస్థలాలకు
వ్యవహారం వెలుగులోకి వచ్చిన వెంటనే వారిద్దరినీ అపహరించి దాచిపెట్టగా పోలీసుల చొరవతో ఇటీవలే బాధితులు స్వస్థలాలకు చేరారు. వారి ఫిర్యాదుతో గాలింపు వేగవంతం చేసిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.

భరత్ రెడ్డిపై చర్యలకు డిమాండ్
భరత్రెడ్డి దాడి చేసిన దృశ్యాలు వెలుగులోకి వచ్చినప్పటి నుంచి దళిత, మానవ హక్కుల సంఘాలు ఆయనపై చర్యలకు డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో భరత్రెడ్డి ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు.












Click it and Unblock the Notifications