'అలా చెప్పడం కేసీఆర్, మంత్రుల అవగాహనా రాహిత్యానికి నిదర్శనం'
హైదరాబాద్: రాష్ట్రంలో జరుగుతున్న రైతుల ఆత్మహత్యలపై రేపటి నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమవేశాల్లో నిలదీస్తామని కాంగ్రెస్ నేత మల్లు భట్టివిక్రమార్క అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఘాటైన విమర్శలు చేశారు.
తెలంగాణ రాష్ట్రం వస్తే బంగారు భవిష్యత్ ఉంటుందనుకున్న రైతులు టీఆర్ఎస్ అనాలోచిత నిర్ణయాల వల్ల ఆత్మహత్యలు చేసుకునే పరిస్ధితి వచ్చిందన్నారు. రైతుల ఆత్మహత్యలకు గత ప్రభుత్వాలే కారణమని సీఎం, మంత్రులు చెప్పడం వారి అవగాహనా రాహిత్యాన్ని తెలియజేస్తోందన్నారు
ప్రభుత్వం అమలు చేసిన రుణమాఫీ సరిగ్గా అమలుకాకపోవడం వల్లనే రైతులు అత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. ప్రాజెక్టుల రీ-డిజైనింగ్, వాటర్గ్రిడ్ పేరుతో నలుగురు కాంట్రాక్టర్లు, సీఎం కుటుంబం కలిసి రూ. 2లక్షల కోట్ల కుంభకోణానికి పథకాలు రచిస్తున్నారని ఆయన ఆరోపించారు.
ప్రభుత్వ వైఫల్యం వల్లే నిరుద్యోగ యువత మావోయిజం వైపు మళ్లుతున్నారని ఆయన అన్నారు. శృతి, సాగర్ ఎన్ కౌంటర్ రాజ్యహింసకు పరాకాష్టగా భట్టి విక్రమార్క అభివర్ణించారు. కేసీఆర్ అప్రజాస్వామిక చర్యలను అసెంబ్లీలో నిలదీస్తామని ఆయన స్పష్టం చేశారు.
తెలంగాణ కవులు, సాహితీవేత్తలు ప్రభుత్వం ప్రోత్సహం: కడియం
తెలంగాణ కవులు, సాహితీవేత్తలు ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. నాంపల్లిలోని తెలుగు యూనివర్సిటీలో 2012 సంవత్సరానికి గాను తెలుగు సాహితీ పురస్కారాల ప్రదానోత్సవం మంగళవారం జరిగింది.
ఈ సందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడుతూ సాహితీవేత్తలు, రచయితలను ప్రోత్సహించేందుకు ఒక్కో రచన పబ్లికేషన్కు రూ. 30 వేలు ఇస్తామన్నారు. యూనివర్సిటీలో లైబ్రరీ నిర్మాణానికి యూజీసీ నిధులు రూ. 5 కోట్లు మంజూరు చేస్తామన్నారు. తెలంగాణ భాష, యాస రచనలను తెలుగు యూనివర్సిటీ ప్రోత్సహించాలని ఆయన పేర్కొన్నారు.
ఓసీటీఎల్ ప్రతినిధులతో మంత్రుల చర్చలు
నల్గొండ జిల్లా నార్కట్పల్లిలోని ఆయిల్ కంపెనీ ట్రిబ్యులర్ లిమిటెడ్(ఓసీటీఎల్) ప్రతినిధులతో జరుగుతున్న చర్చల్లో రాష్ట్ర కార్మికశాఖ, హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, పరిశ్రమలశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావులు పాల్గొన్నారు.
ఆయిల్ కంపెనీ ట్రిబ్యులర్ లిమిటెడ్(ఓసీటీఎల్)లో సంఘం ఏర్పాటు చేశారన్న కోపంతో ఓసీటీఎల్ యాజమాన్యం ఇటీవల 500 మంది కార్మికులను తొలగించింది. దీంతో ఉపాధి కోల్పోయిన కార్మికులు ప్రభుత్వాన్ని ఆశ్రయించారు. దీంతో కార్మికుల సమస్యలపై మంత్రులు ఓసీటీఎల్ ప్రతినిధులతో చర్చిస్తున్నారు.