ఇన్నాళ్లు అజ్ఞాతంలోకి?: నయీం గురించి భువనగిరి ఎమ్మెల్యే ఇలా...
హైదరాబాద్: ఎన్కౌంటరులో హతమైన గ్యాంగస్టర్ నయీం నుంచి తీవ్రమైన బెదిరింపులను ఎదుర్కున్నట్లు భావిస్తున్న నల్లగొండ జిల్లా భువనగిరి శాసనసభ్యుడు ఫైళ్ల శేఖర్ రెడ్డి ఎట్టకేలకు తన నియోజకవర్గ కేంద్రంలో కనిపించారు. మంగళవారం ఆయన అనుచరులు ఘనంగా వేడుకలు జరుపుకున్నారు. భువనగిరిని కేంద్రంగా యాదాద్రి జిల్లాను ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటించినందుకు ఈ వేడుకలు జరుపుకుంటున్నట్లు ఆయన తెలిపారు.
కెసిఆర్కు అభినందనలు తెలియజేయడానికే ర్యాలీ నిర్వహించినట్లు ఆయన తెలిపారు. ఓ ప్రముఖ తెలుగు టీవీ చానెల్ ప్రతినిధితో ఆయన మాట్లాడారు. దాదాపు నెల రోజులుగా ఫైళ్ల శేఖర రెడ్డి ఎక్కడా కనిపించలేదని కూడా ఆ టీవీ చానెల్ వ్యాఖ్యానించింది. నయీం బెదిరింపులపై ఫైళ్ల శేఖర రెడ్డి కెసిఆర్కు విన్నవించినట్లు గతంలో వార్తలు వచ్చాయి. అయితే తానేమీ నయీంపై ఫిర్యాదు చేయలేదని ఆయన చెప్పారు.
తనను ఖతం చేసి, వేరేవాళ్లను భువనగిరిలో పోటీ చేయిస్తానని నయీం అన్నట్లు వచ్చిన వార్తలను కూడా ఆయన ఖండించారు. తనకు నయీం నుంచి బెదిరింపులు రాలేదని చెప్పారు. నయీంపై, అతని మనుషులపై ప్రభుత్వానికి, పోలీసులకు చాలా ఫిర్యాదులు వచ్చేవని అన్నారు. ప్రజలు నయీం మనుషుల గురించి భయపడడం లేదని కూడా ఆయనయ చెప్పారు.
నయీం హతం కావడంపై వేసిన ప్రశ్నకు స్పందిస్తూ - గుండాయిజం, రౌడీయిజం చెల్లదని అన్నారు. కెసిఆర్ ప్రభుత్వంలో చట్టవ్యతిరేకంగా వ్యవహరించేవారిపై చర్యలుంటాయని ఆయన అన్నారు. ప్రజాస్వామ్యంలో చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేవారిని అరెస్టు చేసి జైల్లో పెడుతారని అన్నారు. తాను భువనగిరి వదిలి వెళ్లినట్లు వచ్చిన వార్తలను కూడా ఆయన ఖండించారు. తానేమీ బయటకు వెళ్లలేదని చెప్పారు.
నయీం తరహానే వేరు...
తుక్కుగుడాలోని సామ సంజీవరెడ్డి పంక్షన్ హాల్లో జులై 24వ తేదీన నయీం తన మేనకోడలు నిశ్చితార్థం వేడుకలు నిర్వహించినట్లు టీవీ చానెళ్లలో వార్తలు వచ్చాయి. ఈ వేడుకలకు అతను కొంత మందిని ఆహ్వానించాడని చెబుతున్నారు. అతని ఆహ్వానం కూడా హుకుమేనంటూ టీవీ చానెల్ వ్యాఖ్యానించింది.
ఆహ్వాన పత్రం అందుకున్న వాళ్లు ముందు రోజు ఫోన్ చేస్తే ఎక్కడికి రావాలో నయీం మనుషులు చెప్పారట. తాము చెప్పిన స్థలానికి వచ్చినవారినందరినీ బస్సు ఎక్కించి తీసుకుని వెళ్లారని చెబుతున్నారు. వారి నుంచి సెల్ఫోన్లు లాక్కుని మరీ బస్సు ఎక్కించారని, ఫంక్షన్ ముగిసిన తర్వాత తిరిగి సెల్ఫోన్లు ఇచ్చారని చెబుతున్నారు.