కెసిఆర్ చెంత ఆ ఎమ్మెల్యే ఏడ్చేశారు?: నయీం పొలిటికల్ లింకులు
హైదరాబాద్: గ్యాంగస్టర్ నయీం బెదిరింపులతో నల్లగొండ జిల్లా భువనగిరి శాసనసభ్యుడు ఫైళ్ల శేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు వద్ద ఏడ్చినంత పని చేశారని అంటున్నారు. చంపుతానని చాలా తీవ్రంగా నయీం శేఖర్ రెడ్డిని హెచ్చరించినట్లు తెలుస్తోంది. దీంతో శేఖర్ రెడ్డి కెసిఆర్ చెంతకు వచ్చి విషయం చెప్పి ఏడ్చేశాడని అంటున్నారు.
దాన్ని తీవ్రంగా తీసుకున్న కెసిఆర్ నయీంను ఎలాగైనా పట్టుకోవాలని ఆదేశాలు జారీ చేసినట్లు చెబుతున్నారు. ఈ క్రమంలోనే నయీం వేట తీవ్రమైందని అంటున్నారు. నయీం కోసం పోలీసులు చాలా కాలంగా గాలిస్తున్నప్పటికీ చాలా తీవ్రంగా మూడు నెలల క్రితం నుంచి వేట ప్రారంభించినట్లు తెలుస్తోంది. హైదరాబాద్, హైదరాబాదు పరిసరాల్లోని బస్తీల్లో పోలీసులు కార్డన్ సెర్చ్ ప్రారంభించిన నేపథ్యంలో నయీం షాద్నగర్లోని మిలీనయం టౌన్షిప్కు మకాం మార్చినట్లు చెబుతున్నారు.
నయీం మిలీనియం టౌన్షిప్కు మారడానికి ముందు ఓ బస్తీలో ఉండేవాడని, బస్తీల్లో కార్డన్ సెర్చ్లు జరుగుతున్న నేపథ్యంలో పట్టుబడే అవకాశాలున్నాయని భావించి మిలీనియం టౌన్షిప్లోని నివాసానికి మకాం మార్చినట్లు చెబుతున్నారు. అతి పెద్దగా ఉండే మిలీనియం టౌన్షిప్లో ఎవరుంటున్నారో, ఏం జరుగుతుందో కూడా పట్టని వాతావరణం ఉంటుంది.
సంపన్నవర్గాలు నివసించే ఆ టౌన్షిప్ తనకు రక్షణ కల్పిస్తాడని నయీం భావించాడని చెబుతున్నారు. అయితే, పోలీసులు నయీంను చుట్టుముట్టి ఎదురుకాల్పుల్లో మరణించడంతో తెలంగాణ యావత్తు ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కాగా, అతను మరణించిన తర్వాత కూడా భయాలు తొలగడం లేదు. అతనితో రాజకీయ నాయకుల సంబంధాలపై ఊహాగానాలు చెలరేగుతున్నాయి.
తాజాగా కాంగ్రెసు నేత రాజగోపాల్ రెడ్డి నయీం తనను కూడా బెదిరించాడని చెప్పుకున్నారు. ఎమ్మెల్సీగా పోటీ చేయవద్దని హెచ్చరించాడని ఆయన చెప్పారు. కాగా, కొంత మంది మాజీ మంత్రుల సంబంధాలపై కూడా ఊహాగానాలు చెలరేగుతున్నాయి. నయీంతో బిజినెస్ డీల్స్ కోసం కొందరు, రాజకీయావసరాల కోసం కొందరు, వ్యక్తిగత కక్షలు తీర్చుకోవడానికి మరికొందరు సంబంధాలు పెట్టుకున్నట్లు ప్రచారం సాగుతోంది.
రియల్ ఎస్టేట్ దందా కోసం హైదరాబాదు నగరానికి చెందిన ఓ మంత్రి నయీంతో సంబంధాలు పెట్టుకున్నట్లు కూడా చెబుతున్నారు. కొంత మంది మాజీ ఎమ్మెల్సీల సంబంధాలు కూడా బయటకు వస్తాయని అంటున్నారు. ఈ నేపథ్యంలో డిజిపి అనురాగ్ శర్మ నయీం కేసుపై ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు.