కేటీఆర్పై రాహుల్ అనూహ్య కామెంట్స్.. టీఆర్ఎస్కు ఓటేశా.. పబ్బుల్లో గబ్బు పనులేంది?
తనపై దాడిని తేలికగా తీసుకోబోనని సింగర్, బిగ్ బాస్-3 విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ మరోసారి స్పష్టం చేశారు. పొలిటికల్ పవరుంటే ఏమైనా చేయెచ్చనుకునేవాళ్లకు బుద్ధి చెప్పేదాకా పోరాడుతానని శపథం చేశాడు. గచ్చిబౌలిలోని ప్రిజం పబ్ లో చోటుచేసుకున్న ఘటనపై వెంటనే స్పందించాలంటూ మంత్రి కేటీఆర్, ఎంపీ జోగినపల్లి సంతోశ్ కుమార్ లను ఆయన రిక్వెస్ట్ చేశారు. ఈ మేరకు శుక్రవారం సోషల్ మీడియాలో రాహుల్ అనూహ్య కామెంట్లు చేశారు.
''కేటీఆర్ సార్.. అచ్చమైన హైదరాబాద్ వాసిగా మొదటి నుంచీ నేను టీఆర్ఎస్ కే మద్దతు పలికాను. ఒటు కూడా కారు గుర్తుకే వేశాను. ప్రాణం ఉన్నంతవరకూ తెలంగాణకు సేవ చేయాలనే నిశ్చయించుకున్నాను. సార్.. ప్రజలు ఎంతో నమ్మకంతో ఓట్లేసి నాయకుల్ని గెలిపిస్తారు. కానీ గెలిచినవాళ్లలో కొందరు తమ అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. మన టీఆర్ఎస్ పార్టీకే చెందిన ఓ ఎమ్మెల్యే తమ్ముడు నాపై పబ్లిక్ ప్లేసులో దారుణంగా దాడిచేశాడు. కేవలం ఎమ్మెల్యే తమ్ముడన్న రుబాబుతోనే, తనకేమీ కాదన్న ఉద్దేశంతోనే పేట్రేగిపోయాడు. ఇది ఏమాత్రం కరెక్ట్ కాదు సార్.
పబ్బులు, ఇతర పబ్లిక్ ప్లేసుల్లో ఇలాంటి గబ్బు పనులు చేసేవాళ్లను అరికట్టాల్సిందే. నాకు మీరు న్యాయం చేస్తారనే నమ్మకంతోనే ఇది రాస్తున్నాను. దాడికి పాల్పడ్డవాళ్లపై తగిన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాను. నా రిక్వెస్టును మీరు పట్టించుకుంటారనే భావిస్తున్నాను. అయినా సార్.. ఏ తప్పూ చేయనప్పుడు నేనుగానీ, సామాన్యులు ఎవరైనాగానీ ఇలాంటి పరిస్థితి ఎందుకు ఎదుర్కోవాలి? నాకు న్యాయం దక్కేలా చూడండి'' అని రాహుల్ సిప్లిగంజ్ రాసుకొచ్చాడు. దీంతోపాటు పబ్బులో దాడి ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని కూడా ఆయన జత చేశాడు.
బిగ్ బాస్ షోతో విపరీతంగా పేరుసంపాదించుకున్న రాహుల్ సిప్లిగంజ్ పై బుధవారం రాత్రి గచ్చిబౌలిలోని ప్రిజం పబ్బులో దాడి జరిగింది. తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి సోదరుడిగా భావిస్తున్న వ్యక్తి.. తన అనుచరులతో కలిసి రాహుల్ ను బీర్ బాటిళ్లతో కొట్టినట్లు వీడియోలు లభ్యమయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి రాహుల్ గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై 24 గంటలైనా పోలీసులు స్పందించకపోవడంతో ఫేస్ బుక్, ట్విటర్ ద్వారా మంత్రి కేటీఆర్, ఎంపీ సంతోష్ కుమార్ లకు రిక్వెస్ట్ చేశాడు.