తెలంగాణ: టీఆర్ఎస్ లెక్క బరాబర్: బీజేపీలో జోష్: కాంగ్రెస్కు కొత్త బాస్: టీడీపీకి భారీ లాస్
హైదరాబాద్: తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఇదివరకెప్పుడూ లేనంతగా అన్ని రాజకీయ పార్టీల్లోనూ కీలక రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటోన్నాయి. కింది స్థాయి కార్యకర్తలు సైతం ఆసక్తిగా ఎదురు చూసే సంఘటనలు అవి. అధికార తెలంగాణ రాష్ట్ర సమితి సహా కాంగ్రెస్, భారతీయ జనతాపార్టీ కేంద్రబిందువులుగా అవి ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పేవి కావడంతో అందరి కళ్లూ అటు వైపు మళ్లాయి. సుదీర్ఘకాలం పాటు ఒకే పార్టీని నమ్ముకుని ఉన్న ఇద్దరు కీలక నేతలు ఆయా పార్టీలకు గుడ్బై చెప్పడం, పార్టీలను ఫిరాయించడం తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది.
Mansas trust: సంచైత గజపతిరాజుకు బిగ్ షాక్: ఛైర్మన్గా మళ్లీ అశోక్: హైకోర్టు సంచలనం
ఒకే రోజు రెండు కీలక పరిణామాలు
అటు ఎల్ రమణ, ఇటు ఈటల రాజేందర్.. సుదీర్ఘకాలం పాటు తెలుగుదేశం పార్టీ, టీఆర్ఎస్లల్లో కొనసాగినవారే. ఆవిర్భావం నుంచీ జెండా మోసిన వారే. ఈటల రాజేందర్ టీఆర్ఎస్ను వీడి కమలనాథుల్లో చేరడం, దాదాపు అదే సమయంలో ఎల్ రమణ.. టీడీపీని వీడబోతోన్నట్లు ప్రకటించడం యాదృచ్ఛికంగా చోటు చేసుకున్నవే. ఈటల బీజేపీలో చేరుతారనే వార్తలు ముందు నుంచీ వినిపిస్తోన్నప్పటికీ.. ఎల్ రమణ రాజీనామా వ్యవహారం మాత్రం కొత్తగా తెరమీదికి వచ్చింది. ఆయన రాజీనామా వెనుక టీఆర్ఎస్ నేతల హస్తం లేకపోలేదనే అభిప్రాయాలు ఉన్నాయి.
ఒక మైనస్.. ఒక ప్లస్
బీసీ నాయకుడు ఈటల రాజేందర్.. బయటికి వెళ్లడం వల్ల వచ్చిన నష్టాన్ని టీఆర్ఎస్.. ఎల్ రమణతో పూడ్చుకోవడం దాదాపు ఖాయమైంది. ఎల్ రమణ కూడా బీసీ నాయకుడే కావడం గులాబీ పార్టీకి కలిసొచ్చే అంశం. ఈ కోణంలో చూస్తే టీఆర్ఎస్కు పెద్దగా డ్యామేజీ జరగలేదనే అనుకోవాల్సి ఉంటుంది. లెక్క బరాబర్గా తేలినట్టవుతుంది. ఈటల మిగిల్చిన నష్టాన్ని ఎల్ రమణ ఎంత వరకు భర్తీ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఎల్ రమణ ప్రభావం ఎంత వరకు ఉంటుందనేది ఇంకా తేలాల్సి ఉంది.
బీజేపీకి బలమేనా?
ఈటల రాజేందర్ చేరిక బీజేపీకి లాభమా? నష్టమా అనేది కూడా ఇప్పట్లో తేలకపోవచ్చు. తాను ప్రాతినిథ్యాన్ని వహించిన హుజూరాబాద్ను టీఆర్ఎస్కు కంచుకోటగా మార్చిన ఈటల రాజేందర్ వెంట..టీఆర్ఎస్ నాయకులు గానీ, కార్యకర్తలు గానీ వెంట రాకపోవడం చర్చనీయాంశమైంది. హుజూరాబాద్లో టీఆర్ఎస్ నాయకులు పెద్దగా ఈటల వెంట వెళ్లలేదు. ఈ ప్రకారం చూసుకుంటే.. ఈటల తన ఓటుబ్యాంకును మళ్లీ బలోపేతం చేసుకోవడంపై దృష్టి సారించాల్సి ఉంటుంది. ఒక కీలక నాయకుడు బీజేపీలో చేరడం ఖచ్చితంగా ప్లస్ అవుతుందనే అభిప్రాయాలు ఉన్నాయి.
టీడీపీకి భారీగా నష్టం
ఈ ఎపిసోడ్ మొత్తంలో టీడీపీ భారీగా నష్టపోయిందనేది స్పష్టమౌతోంది. తెలంగాణ వంటి రాజకీయ ప్రాధాన్యత ఉన్న రాష్ట్రంలో- జాతీయ పార్టీగా గుర్తింపు పొందిన తెలుగుదేశానికి సారథ్యాన్ని వహిస్తోన్న స్వయానా రాష్ట్రశాఖ అధ్యక్షుడే రాజీనామా చేయడం ఓ కుదుపే. ఆయన వెంట వెళ్లే క్యాడర్ దీనికి బోనస్గా మారొచ్చు. ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన తరువాత ఏ ఎన్నికలోనూ తనదైన మార్క్ను చూపించలేకపోయిన టీడీపీ ఉనికి.. ఎల్ రమణ రాజీనామాతో మరింత ప్రశ్నార్థకమైంది. అదే సమయంలో- తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి కొత్త చీఫ్ రాబోతోండటం మరో కీలకాంశం. మల్కాజ్గిరి లోక్సభ సభ్యుడు రేవంత్ రెడ్డి- తెలంగాణ పీసీసీ పగ్గాలు అప్పగించడం దాదాపు ఖాయమైనట్టే. ప్రస్తుతం ఆయన ఢిల్లీలో ఉంటోన్నారు.