అంబులెన్సులకు మహిళా డ్రైవర్లు, ప్రభుత్వ విప్లవాత్మక నిర్ణయం!
మహిళలకు ఉద్యోగావకాశాలు, ఆర్థిక స్వావలంబన కల్పించడంలో భాగంగా 102 తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలకు మహిళా డ్రైవర్లను నియమించే దిశగా చర్యలు చేపడుతున్నామని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ తెలిపారు. మహిళలు అన్ని రంగాల్లోనూ సమర్థంగా పనిచేస్తున్నారని.. డ్రైవింగ్ కూడా వారికి సాధ్యమేనని చెప్పారు. 102 వాహనాల నిర్వహణ సంస్థ.. కన్సార్టియం ఆఫ్ విద్యా వేదా ఫౌండేషన్ అండ్ శ్రీనివాసా టూర్స్ అండ్ ట్రావెల్స్ మహిళా డ్రైవర్ల నియామకానికి ప్రతిపాదన చేసిందని.. ప్రభుత్వం దీనిపై సానుకూలంగా ఉందన్నారు. పల్నాడు జిల్లా నరసరావుపేట లోని ఏరియా ఆసుపత్రి వద్ద మంగళవారం 102 ఆధునిక అంబులెన్స్ ల సేవలను ప్రారంభించి, మంత్రి మాట్లాడారు.
102.. 104.. 108.. ఒకే లక్ష్యం
గర్భధారణ నుంచి ప్రసవం వరకు 102, అత్యవసర పరిస్థితుల్లో 108, గ్రామస్థాయిలో పరీక్షలు, చికిత్సలకు 104 సేవలను అనుసంధానిస్తూ సమగ్ర ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి తెలిపారు. ప్రజలు ఆసుపత్రుల చుట్టూ తిరిగే అవసరం తగ్గించి.. అవసరమైన సేవలను వీలైనంత వరకు వారి వద్దకే తీసుకెళ్లడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.

తల్లీబిడ్డలకు మరింత భరోసా
102 తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్ సేవలను ప్రసవం అనంతరం ఆసుపత్రి నుంచి ఇంటికి చేర్చడానికే పరిమితం చేయకుండా గర్భధారణ దశ నుంచే విస్తరిస్తున్నామని మంత్రి తెలిపారు. యాంటీనాటల్ చెకప్లకు వెళ్లే గర్భిణులు 102 సేవలను వినియోగించుకోవచ్చని చెప్పారు. హైరిస్క్ ప్రెగ్నెన్సీ కేసులను ఆసుపత్రికి తరలించడంతోపాటు రక్తహీనతతో బాధపడే గర్భిణులకు అవసరమైన చికిత్స అందేలా సేవలను విస్తరిస్తున్నామని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా 500 కొత్త 102 వాహనాలు అందుబాటులోకి తెస్తున్నామని.. తొలి విడతలో 300, మరో రెండు నెలల్లో 200 వాహనాలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. వాహనాల్లో ఏసీ, ఆరు ఎయిర్బ్యాగులు, ఫుట్రెస్ట్, జీపీఎస్ ట్రాకింగ్, అత్యవసర ఎస్వీఎస్ బటన్ వంటి సదుపాయాలు కల్పించామని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ నరసరావుపేటలో 50 వాహనాలు ప్రారంభించారు. దీనికి అనుగుణంగా ప్రతి జిల్లాల్లోనూ 300 అంబులెన్సుల సేవలను అధికారులు, ప్రజాప్రతినిధుల ద్వారా ప్రారంభం అయ్యాయి.
108, 104లోనూ మార్పులు
అత్యవసర వైద్య సేవల్లో 108ను బలోపేతం చేశామని మంత్రి తెలిపారు. అంబులెన్సుల సంఖ్యను 602 నుంచి 733కు పెంచామని.. సుమారు 170 అధునాతన జీవనాధార సదుపాయాలున్న వాహనాలు ఉన్నాయని చెప్పారు. పట్టణ, గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో అంబులెన్స్ చేరే సమయాన్ని కూడా తగ్గించామని తెలిపారు. 104 మొబైల్ మెడికల్ యూనిట్ల ద్వారా గ్రామాల్లోనే 41 రకాల పరీక్షలు ఉచితంగా నిర్వహించేలా సేవలను విస్తరిస్తున్నామని చెప్పారు. పరీక్షల ఫలితాల ఆధారంగా తదుపరి వైద్య సేవలను అందించేలా సంజీవని వేదికను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో పెరిగిన సేవలు
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైద్య, నర్సింగ్, పారామెడికల్ తదితర విభాగాల్లో సుమారు 12 వేల నియామకాలు చేపట్టామని మంత్రి తెలిపారు. సిబ్బంది అందుబాటులోకి రావడంతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఓపీ, ఐపీ సేవలు పెరిగాయని చెప్పారు. నరసరావుపేట ఆసుపత్రిలో మేజర్ సర్జరీలు 3,248 నుంచి 4,321కు, ఎక్స్రేలు 14 వేల నుంచి 15,450కు, ఈసీజీలు 5,832 నుంచి 6,900కు పెరిగాయని వివరించారు.














Click it and Unblock the Notifications