వరంగల్ కు వరద ఇందుకే.. ఈ పాపం వాళ్ళదే!
కనివిని ఎరుగని విధంగా వరంగల్ నగరాన్ని వరద ముంచేసింది. గ్రేటర్ వరంగల్ లోని అన్ని ప్రాంతాలను వరద అష్టదిగ్బంధనం చేసింది. దాదాపు 115 కు పైగా కాలనీలు నీటమునిగాయి. వరద ముంపు ప్రభావం ఎన్నో కుటుంబాలలో తీవ్ర ఆవేదనను మిగిల్చింది. అర్ధరాత్రి గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఒక్కసారిగా వరద ముంచెత్తడంతో ప్రజలు నిరాశ్రయులయ్యారు. తినడానికి తిండి లేక, ఉండడానికి స్థలం లేక, వరదలో కన్నీరు మున్నీరయ్యారు.
వరంగల్ వరద పాపం ఎవరిది
వరంగల్ నగరంలోని వేలాది కుటుంబాలను నిరాశ్రయులను చేసిన, తీవ్ర వేదనకు గురి చేసిన ముంపుకు కారణాలేంటి? ఈ ముంపు పాపం ఎవరిది? గ్రేటర్ వరంగల్... పేరుకే వరంగల్ మహానగరం. ఒక్కరోజు వర్షానికి వణికిపోయిన, విలవిలలాడిన నగరం. గడచిన ఐదేళ్ళలో వరంగల్ నగరం ముంపుకు గురి కావటం ఇది రెండోసారి. వరంగల్ మహానగరంలో పెరుగుతున్న నగరానికి తగ్గట్టుగా మౌలిక వసతుల కల్పన జరగటం లేదు.

నాలాల కబ్జా.. నిర్వహణ అస్తవ్యస్తం
ఎక్కడికక్కడ గత బీఆర్ఎస్ పాలన నుండి నేటి కాంగ్రెస్ పాలన వరకు వరద ముంపు నివారణ చర్యలు లేకపోవడం, వరంగల్ నగరాన్ని ముంపుకు గురి చేశాయి.వరంగల్ నగర పరిధిలో దాదాపు 20 నాలాలు ఉన్నప్పటికీ, ఎక్కడికక్కడ నాలాలు కబ్జాలకు గురయ్యాయి. కనీసం 20 మీటర్ల వెడల్పు ఉండవలసిన నాలాలు కేవలం 10మీటర్లకు కుదించుకుపోయాయి. ఈ నాలాల వ్యవస్థ సక్రమంగా లేకపోవడం, సరిగ్గా నిర్వహించకపోవడం ముంపుకు ఒక కారణంగా చెప్పవచ్చు.
ఆ చెరువులు మాయం, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లేదు
ఇది మాత్రమే కాదు వరంగల్ నగరవ్యాప్తంగా చెరువులు, కుంటల భూములు కబ్జాలకు గురయ్యాయి. ఇక నగరం కాంక్రీట్ జంగిల్ లా మారిపోయింది. నగరంలో ఎంతో కాలంగా చర్చ జరుగుతున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టం వరంగల్ నగరానికి లేదు. గోపాలపూర్ ప్రాంతంలోని కాకతీయుల కాలంనాటి ఆరు చెరువులు మాయమయ్యాయి.
స్మార్ట్ సిటీ, అమృత్ నిధులను ఏం చేస్తున్నారు
స్మార్ట్ సిటీ, అమృత్ తదితర పథకాల కింద అభివృద్ధి పేరుతో వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న వరద ముంపు నివారణకు చర్యలను తీసుకోవడంలో అధికారులు ఫెయిల్ అవుతున్నారు. డక్ట్ కోసం స్మార్ట్ సిటీ, ఆర్ అండ్ బి నుండి నిధులు 100 కోట్ల రూపాయలు కేటాయించి, నిర్మించినప్పటికీ, డక్ట్ గేట్లు తెరుచుకోకపోవడంతో పలు కాలనీలు నీటమునిగాయి.
శాశ్వత చర్యలు లేక వరద ముంపు
పాలకులు, రాజకీయ పార్టీల నాయకులు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ నాయకులు వరద వచ్చినప్పుడు హడావిడి చేసి, ఆ తరువాత ఆ ఊసే ఎత్తకపోవడంతో, శాశ్వత ప్రాతిపదికన చర్యలు చేపట్టకపోవటంతో వరంగల్ మహానగరం ముంపుకు గురవుతోంది. నగర వ్యాప్తంగా రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థ కూడా సరిగ్గా లేకపోవటం ముంపుకు కారణం. ఈ పరిస్తితులతోనే వరద ముంపు వేల కుటుంబాలను కన్నీటి పర్యంతం చేస్తోంది.












Click it and Unblock the Notifications