వాహనదారులకు బిగ్ రిలీఫ్ .. పెండింగ్ చలాన్లు ఉన్నా .. వాహనం సీజ్ చేసే హక్కు ట్రాఫిక్ పోలీసులకు లేదన్న హైకోర్టు
వాహనదారులకు హైకోర్టు బిగ్ రిలీఫ్ ఇచ్చే వార్త చెప్పింది. పెండింగ్ చలాన్లు ఉన్న వాహనాలు కనబడితే ట్రాఫిక్ పోలీసులు సీజ్ చేసే హక్కు లేదని తెలంగాణ హైకోర్టు తేల్చి చెప్పింది. వాహనాలపై మూడు లేదా అంతకంటే ఎక్కువ ఈ చలాన్ లు పెండింగ్ ఉంటే, అలాంటి వాహనాలు కనపడితే సీజ్ చేస్తామని ట్రాఫిక్ పోలీసులు నిర్ణయం తీసుకున్నారన్న వార్తల నేపథ్యంలో వాహనదారులు బయటికి వెళ్లాలంటేనే భయపడుతున్న పరిస్థితి ఉంది. ఇక వాహనదారుల భయానికి చెక్ పెడుతూ హైకోర్టు జారీచేసిన మార్గదర్శకాలు వాహనచోదకులకు ఊరట కలిగిస్తున్నాయి.
పెండింగ్ చలాన్లు ఉంటే వాహనం సీజ్ వార్తలు .. ఆందోళన చెందిన వాహన చోదకులు
ఇటీవలే ఒక చలానా పెండింగ్ లో ఉందని కూకట్ పల్లికి చెందిన ఒక వ్యక్తి బైక్ ను ట్రాఫిక్ పోలీసులు సీజ్ చేసిన విషయం తెలిసిందే. వాహనం సీజ్ పై వాహనదారుడు కోర్టులో పిటీషన్ దాఖలు చేసిన నేపధ్యంలో కోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ఇక రాష్ట్రవ్యాప్తంగానూ ఈ చలాన్ లు మూడు కంటే ఎక్కువ పెండింగ్లో ఉంటే వాహనాలను సీజ్ చేస్తామని చేసిన ప్రకటన రాష్ట్ర వ్యాప్తంగా వాహనచోదకులకు ఆందోళన కలిగించింది.
ఎక్కువ చలానాలు ఉన్న వాహనాలను సీజ్ చేస్త్తామని అనేకచోట్ల ట్రాఫిక్ అధికారులు చెప్పినట్లుగా వార్తలు రావడం వాహనచోదకులకు మరింత ఆందోళన కలిగించింది. కొందరు అప్రమత్తమై తమ వాహనాలపై ఉన్న పెండింగ్ జరిమానాలను చెల్లించి ఎలాంటి ఇబ్బంది లేకుండా క్లియర్ చేసుకుంటే, మరికొందరు వాటిని చెల్లించకుండా వెహికల్ చెకింగ్ చేస్తున్న దగ్గర ట్రాఫిక్ పోలీసులకు అడ్డంగా దొరికిపోతున్నారు.
వాహనం సీజ్ పై కోర్టులో పిటీషన్ ..వాహనం సీజ్ చేసే హక్కు ట్రాఫిక్ పోలీసులకు లేదన్న హైకోర్టు
అయితే పెండింగ్ చలానా వున్న వాహనాన్ని సీజ్ చేసే అధికారం ట్రాఫిక్ పోలీసులకు లేదని తెలంగాణ హైకోర్టు మార్గదర్శకాలను జారీ చేసింది. కూకట్ పల్లి కోర్ట్ లో న్యాయవాదిగా పనిచేస్తున్న నిఖిలేష్ ఆగస్టు 1వ తేదీన బైక్ పైవెళ్తుండగా ట్రాఫిక్ పోలీసులు ఆపి, ఆ బైక్ పై 1635 రూపాయల చలానా పెండింగ్ ఉందని, చెల్లించాలని కోరారు. అందుకు నిరాకరించిన నిఖిలేష్ వాహనాన్ని సీజ్ చేశారు. ప్రవేశం లేని ఓవర్ బ్రిడ్జి పై ప్రయాణించారని, ప్రమాదకర డ్రైవింగ్ చేశారని, ఆదేశాల ఉల్లంఘన పేరిట మొత్తంగా పదహారు వందల ముప్పై ఐదు రూపాయల జరిమానా చెల్లించాలని చెప్పడంతో న్యాయవాది నిఖిలేష్ అవాక్కయ్యారు.
ట్రాఫిక్ పోలీసుల తీరును కోర్టులో సవాల్ చేసిన న్యాయవాది నిఖిలేష్
నో ఎంట్రీ కి కేవలం 135 రూపాయలు జరిమానా వేయాల్సింది, ఇంత ఎలా రాశారు అంటూ ట్రాఫిక్ పోలీసులను ప్రశ్నించారు. దీంతో ట్రాఫిక్ పోలీసులు నిఖిలేష్ బైక్ ను సీజ్ చేశారు. బైక్ ఎలా సీజ్ చేస్తారు అని ప్రశ్నించిన నిఖిలేష్ కు పోలీసులు రూల్స్ ప్రకారమే సీజ్ చేశామని చెప్పారు. అంతేకాదు సదరు న్యాయవాది హైకోర్టులో రిట్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టు పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. చట్ట ప్రకారం వాహనాన్ని సీజ్ చేసే రైట్ పోలీసులకు లేదని పేర్కొంది. వాహనాన్ని తిరిగి ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు.
ట్రాఫిక్ పోలీసులపై వాహనదారులు, వాహనదారులపై ట్రాఫిక్ పోలీసుల వెర్షన్ ఇది
హైకోర్టు ఎన్నిసార్లు మొట్టికాయలు వేసినా వాహనచోదకుల విషయంలో ట్రాఫిక్ పోలీసుల తీరు మారలేదు. చాలాచోట్ల అన్ని పత్రాలు సక్రమంగా ఉన్నప్పటికీ ట్రాఫిక్ పోలీసులు వాహనదారులను ఇబ్బందులు పెడుతున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే సమయంలో వాహనచోదకులు నిబంధనలను తుంగలో తొక్కి ఇష్టారాజ్యంగా వాహనాలు నడుపుతున్నారన్న అభిప్రాయాన్ని కూడా ట్రాఫిక్ పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. ఎంత జరిమానాలు విధించినా చెల్లించకుండా మళ్ళీ మళ్ళీ ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని అంటున్నారు.