కాంగ్రెస్కు బిగ్ షాక్: బీజేపీలోకి ఎమ్మెల్యే కోమటిరెడ్డి... రేవంత్ ఎఫెక్ట్? సంచలన ప్రకటన...
తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. భవిష్యత్తులో బీజేపీలో చేరబోతున్నట్లు ప్రకటించారు. తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీకి బలమైన ప్రత్యామ్నాయ శక్తిగా బీజేపీ ఎదుగుతోందన్నారు. రాష్ట్రంలో బీజేపీ బలమైన శక్తిగా ఎదుగుతోందని మొట్టమొదటగా చెప్పిన వ్యక్తిని తానేనని అన్నారు. తాను బీజేపీలోకి వెళ్లినప్పటికి తన సోదరుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాత్రం కాంగ్రెస్లో కొనసాగుతారని రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు.
Recommended Video
అన్నాదమ్ములుగా కలిసే ఉన్నప్పటికీ రాజకీయంగా ఎవరి అభిప్రాయాలు వారివేనని చెప్పారు. రాజగోపాల్ రెడ్డి తాజా ప్రకటన కొత్త సంవత్సరం మొదటిరోజే కాంగ్రెస్పై పెద్ద బాంబ్ వేసినట్లయింది. శుక్రవారం(జనవరి 1) ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం రాజగోపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
పీసీసీ పదవిపై రాజగోపాల్ రెడ్డి...
టీపీసీసీ చీఫ్ పదవి కోసం రేవంత్ రెడ్డి, వెంకట్ రెడ్డిలు ఎవరికి వారు గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారని రాజగోపాల్ రెడ్డి చెప్పారు. అయితే ఎవరి ప్రయత్నాలు ఎంతమేరకు విజయవంతం అవుతాయో కాలమే నిర్ణయిస్తుందన్నారు. నిజానికి పీసీసీ చీఫ్ పదవిపై రాజగోపాల్ రెడ్డి కూడా ఆశలు పెట్టుకున్నారు. ఆర్థికంగా బలమైన నేత కావడం,దూకుడుగా వ్యవహరించే శైలి తనకు కలిసొస్తాయని భావించారు.
కానీ అధిష్టానం రాజగోపాల్ రెడ్డి పేరును పరిశీలనలోకి తీసుకోలేదు. దీంతో ఆయనలో అసంతృప్తి మరింత తీవ్రమైంది. మరోవైపు రాష్ట్రంలో బీజేపీ మరింత పుంజుకోవడం,కాంగ్రెస్ నానాటికీ బలహీనపడుతుండటంతో కాషాయ కండువా కప్పుకునేందుకు ఆయన సిద్దమైనట్లు తెలుస్తోంది.
గతంలోనే షాకిచ్చిన రాజగోపాల్ రెడ్డి
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏడాది క్రితమే అనూహ్య వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీకి షాకిచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్కు భవిష్యత్ లేదని, బీజేపీనే ప్రత్యామ్నాయమని అప్పట్లో వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలతో తాను బీజేపీ వైపు చూస్తున్నట్లు పరోక్షంగా హింట్ ఇచ్చారన్నది ఆయన తాజా ప్రకటనతో స్పష్టమవుతోంది. రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో అప్పట్లోనే ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ అధిష్టానం భావించినప్పటికీ ఎందుకనో వెనక్కి తగ్గాల్సి వచ్చింది.
రేవంత్కు ఇవ్వడం ఇష్టం లేకనేనా...?
కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డికి టీపీసీసీ ఇవ్వడం చాలామంది సీనియర్లకు మింగుపడటం లేదన్న చర్చ కొంతకాలంగా జోరందుకుంది. గతంలోనే రేవంత్కు టీపీసీసీ ఇచ్చేందుకు అధిష్టానం సిద్దపడగా సీనియర్లు దానికి బ్రేక్ వేశారన్న విమర్శలున్నాయి. తాజాగా రేవంత్ పేరును అధిష్టానం ఖరారు చేయడంతో ఇలా సీనియర్లు తమ దారి తాము చూసుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే సీనియర్లు వీహెచ్,జగ్గారెడ్డి తదితర నేతలు రేవంత్కు టీపీసీసీ ఇవ్వడాన్ని బహిరంగంగానే వ్యతిరేకించారు. రేవంత్కు టీపీసీసీ ప్రకటిస్తే పార్టీకి రాజీనామా చేస్తానని వీహెచ్ ఇప్పటికే ప్రకటించారు. తాజాగా రాజగోపాల్ రెడ్డి ఏకంగా బీజేపీలో చేరబోతున్నట్లు ప్రకటించేశారు. రేవంత్కు పీసీసీ దక్కితే పార్టీలో అంతా వన్ సైడ్ అయిపోతుందని సీనియర్లు భావిస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రేవంత్ వర్గం తమకు ప్రాధాన్యత ఇవ్వదని... అలాంటప్పుడు పార్టీలో ఉండటమెందుకని వారు భావిస్తున్నట్లు తెలుస్తోంది.