కేసీఆర్, జగన్లకు మోడీ ఫోన్: మమత గురించి చంద్రబాబు వద్ద ఆరా
ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థిగా రామ్నాథ్ కోవింద్ పేరును బిజెపి జాతీయ అధ్యక్షులు అమిత్ షా ప్రకటించిన అనంతరం ప్రధాని నరేంద్ర మోడీ పలు రాజకీయ పార్టీల నేతలకు ఫోన్ చేసి మద్దతు కోరారు.
న్యూఢిల్లీ: ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థిగా రామ్నాథ్ కోవింద్ పేరును బిజెపి జాతీయ అధ్యక్షులు అమిత్ షా ప్రకటించిన అనంతరం ప్రధాని నరేంద్ర మోడీ పలు రాజకీయ పార్టీల నేతలకు ఫోన్ చేసి మద్దతు కోరారు.

ఏకగ్రీవం కోసం..
పలు రాష్ట్రాల ముఖ్యమంత్రుల, ఏఐసీస అధ్యక్షురాలు సోనియా గాంధీ, మాజీ మన్మోహన్ సింగ్ తదితరులకు ప్రధాని మోడీ స్వయంగా ఫోన్ చేశారు. ఎన్డీయే అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. బీహార్ సీఎం నితీష్ కుమార్కు కూడా ఫోన్ చేశారు.

చంద్రబాబుకు ఫోన్
ప్రధాని నరేంద్ర మోడీ ఏపీ సీఎం, టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుకు ఫోన్ చేశారు. రామ్నాథ్ను రాష్ట్రపతి అభ్యర్థిగా నిర్ణయించినట్లు తెలిపారు. ఆయన అభ్యర్థిత్వంపై చంద్రబాబు.. మోడీని ప్రశంసించారు. ఓ దళిత నేతను రాష్ట్రపతిగా చేయాలన్న మీ నిర్ణయం అభినందనీయమని ఈ సందర్భంగా తెలిపారు.

మమతా బెనర్జీ గురించి ఆరా
రాష్ట్రపతి ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి ఎన్డీయే అభ్యర్థికి మద్దతిచ్చేలా ఒప్పించే బాధ్యతను బిజెపి చంద్రబాబుపై ఉంచింది. ఈ నేపథ్యంలో మమతతో చర్చలు ఎంత వరకు వచ్చాయని చంద్రబాబుకు ఫోన్ చేసిన సందర్భంగా మోడీ ఆరా తీశారు. మోడీ ఫోన్ అనంతరం చంద్రబాబు కూడా మమతకు కాల్ చేశారు. ఎన్డీయేకు మద్దతు గురించి మాట్లాడారు.

కేసీఆర్, జగన్లకు ఫోన్
రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థికి మద్దతివ్వాలని కోరుతూ ప్రధాని మోడీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేశారు. మీ సూచన మేరకు కూడా దళిత అభ్యర్థిని ప్రకటించామని మోడీ.. కేసీఆర్కు చెప్పారని తెలుస్తోంది. వైసిపి, తెరాస రెండు కూడా ఎన్డీయేకే మద్దుతు ఇవ్వనున్నాయి. ఈ మేరకు జగన్ ఇప్పటికే ప్రకటన కూడా చేశారు. మరోవైపు, అద్వానీ, వామపక్ష నేతలతో వెంకయ్య నాయుడు మాట్లాడారు.

ఎన్డీయే పక్షాలు సైతం ఊహించని పేరు
రాష్ట్రపతి అభ్యర్థిగా బిజెపి అనూహ్యంగా రామ్నాథ్ కోవింద్ పేరును తెరపైకి తీసుకు వచ్చింది. ఇప్పటి వరకు అద్వానీ, సుష్మా స్వరాజ్.. ఇలా పలువురి పేర్లు ప్రచారంలో ఉన్నాయి. కానీ ఏమాత్రం ప్రచారంలో లేని రామ్నాథ్ పేరును అనూహ్యంగా తెరపైకి తీసుకు వచ్చింది. అదే సమయంలో ఓ దళిత నేతను ప్రకటించడం ద్వారా సాద్యమైనంత మేర ఇతర పార్టీల మద్దతు కూడా కూడగట్టాలని భావించింది. శివసేన సాయంత్రం తన నిర్ణయాన్ని ప్రకటించనుంది. విపక్షాల భేటీ అనంతరం జేడీయూ తన నిర్ణయాన్ని చెప్పే అవకాశముంది.












Click it and Unblock the Notifications