బైక్ బుక్ చేసుకున్న మహిళను లైంగికంగా వేధించిన రైడర్: కేసు నమోదు
హైదరాబాద్: బైక్ రైడర్ నుంచి ఓ మహిళకు ఊహించని అనుభవం ఎదురైంది. ఓ మహిళా ప్రయాణికురాలిపై బైక్ టాక్సీ డ్రైవర్ లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన హైదరాబాద్ నగరంలో చోటు చేసుకుంది. 20 ఏళ్ల బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. మణికొండలోని ఓ కంపెనీలో కంటెంట్ క్రియేటర్గా విధులు నిర్వహిస్తున్న మహిళ.. రైడ్ అగ్రిగేటర్ యాప్లో సోమవారం తన రైడ్ బుక్ చేసుకుంది. బంజారాహిల్స్లోని తన నివాసానికి ఈ రైడ్ బుక్ చేసుకుంది.

ఈ క్రమంలో వచ్చిన రైడర్ బైక్పై ఆమె కూర్చుంది. ప్రయాణం మొదలైన కాసేపటికే ఆ మహిళ పట్ల రైడర్ అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమె శరీర భాగాలను తాకుతూ పైశాచికాన్ని ప్రదర్శించాడు. జూబ్లీహిల్స్ లోని ప్రశాంత్ నగర్ మార్గంలో వెళుతుండగా నిందితుడు ఈ దుశ్చర్యకు పాల్పడ్డాడు.
ఈ నేపథ్యంలో బైకర్ చేష్టలను ఆమె తీవ్రంగా ప్రతిఘటించింది. దీంతో ఆమెను అక్కడే వదిలేసిన బైకర్.. అక్కడ్నుంచి పరారయ్యాడు. ఈ ఘటనతో తీవ్ర భయాందోళనకు గురైన బాధితురాలు.. నిందిత రైడర్ పై పోలీసులకు ఫిర్యాదు చేసింది.
లైంగిక ఆరోపణలతోపాటు పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఈ ఘటనపై దర్యాప్తు జరిపారు.












Click it and Unblock the Notifications