భారత ఆర్మీకి పనికొచ్చేలా హైదరాబాద్ విద్యార్థుల ఆవిష్కరణ..జీపీఎస్ అవసరమే లేని డ్రోన్స్!
హైదరాబాద్ విద్యార్థులు చాలా ప్రతిభ ఉన్నవారు. నైపుణ్యంతో కూడిన సాంకేతికతలో మేము సైతం దేశంకోసం అంటూ హైదరాబాదీ స్టూడెంట్స్ చేసిన కొత్త ఆవిష్కరణ ఇప్పుడు భారత ఆర్మీకి బాగా ఉపయోగపడనుంది. ఇండియన్ ఆర్మీ అధికారులు టెస్ట్ చేసి తమకు ఉపయోగపడతాయని వారికి తయారీకి ఆర్డర్స్ ఇస్తున్నారంటే మనవాళ్ళ ప్రతిభను అర్ధం చేసుకోవచ్చు.
వివిధ రంగాల్లో దేశానికి కావాల్సిన సేవలు అందించటంలో తెలంగాణా రాష్ట్రం, అందులోనూ హైదరాబాద్ కు ప్రత్యేక గుర్తింపు ఉంది. అలాంటి హైదరాబాద్లో భారత సైన్యాన్ని వ్యూహాత్మకంగా బలోపేతం చేసేలా అత్యాధునిక డ్రోన్లను రూపొందించారు బిట్స్ విద్యార్థులు. నమన్ కస్లివాల్, శివ్ పాటిల్ అనే ఈ ఇద్దరు విద్యార్థులు 'బీజన్' పేరుతో స్టార్టప్ స్థాపించి ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేశారు.

బీజన్ ద్వారా డెవలప్ చేసిన అత్యాధునిక డ్రోన్స్ సామర్ధ్యాన్ని బిట్స్లోని కోరస్ ప్రయోగశాలలో పరీక్షించి మెరుగైన ఫలితాలు సాధించారు. వీరు అభివృద్ధి చేసిన 'బీజన్ అటానమస్ నావిగేషన్ మాడ్యూల్' ఇదొక సాఫ్ట్వేర్ ప్రత్యేకత. సహజంగా జీపీఎస్ ఆధారంగా డ్రోన్స్ నడుస్తాయి. కానీ ఇది జీపీఎస్ అవసరం లేకుండానే డ్రోన్లను సరైన గమ్యస్థానాలకు చేరుస్తుంది. ఏ రేడియో తరంగాలనైనా ఛేదించుకుని ముందుకు సాగే సామర్థ్యం దీనిది.
శత్రు దేశాల డ్రోన్ దాడులు, అక్రమ చొరబాట్లను అరికట్టడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. ఈ డ్రోన్లను సికింద్రాబాద్, లేహ్తో పాటు మరికొన్ని మిలిటరీ కేంద్రాల్లో ప్రయోగాత్మకంగా పరిశీలించారు. ఇటీవల ఇండియన్ ఆర్మీ సదరన్ కమాండ్లో ఈ డ్రోన్స్ ప్రదర్శన చేశారు. పనితీరు నచ్చడంతో మరో ఎనిమిది మిలిటరీ యూనిట్ల అధికారులు కూడా తమకు కావాలని లేఖలు రాశారు.
రోబోటిక్స్, ai సాంకేతికత సహకారంతో పూర్తి స్వదేశీ పరికరాలతోనే వీటిని రూపొందించామని విద్యార్థులు తెలిపారు. ఐఐటీ బాంబేలో జరిగిన రోబోటిక్స్ పోటీల్లో రన్నరప్గా నిలవడం ఈ ఆవిష్కరణకు స్ఫూర్తినిచ్చింది. గత ఏడాది ఐఐటీ గాంధీనగర్లో జరిగిన 'క్యూరియాసిటీ-2025'లో వీరి ప్రాజెక్ట్కు రూ.25 లక్షల గ్రాంట్ లభించింది. తెలంగాణ విద్యార్థుల ఈ వినూత్న కృషి ఇండియన్ ఆర్మీ భద్రతను, సామర్ధ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా సాగుతోంది.













Click it and Unblock the Notifications
