నందమూరి సుహాసినికి మరోసారి చేదు అనుభవం, అరెస్ట్ చేయాలని టీడీపీ డిమాండ్
హైదరాబాద్: ప్రజా ఫ్రంట్ (మహాకూటమి) పొత్తులో భాగంగా తెలుగుదేశం పార్టీ తరఫున కూకట్పల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న నందమూరి హరికృష్ణ కూతురు నందమూరి సుహాసినికి మరోసారి చేదు అనుభవం ఎదురయింది. ప్రచారంలో భాగంగా పలువురు తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) కార్యకర్తలు ఆమెను అడ్డుకుంటున్నారు.
తెలంగాణ ఎన్నికలు: ఏ సర్వే ఏం చెబుతోంది, వారికి ఊహించని షాక్ తప్పదా?
కూకట్పల్లిలో టీఆర్ఎస్ వర్సెస్ టీడీపీ
నామినేషన్ దాఖలు చేసినప్పటి నుంచి ఆమె ప్రచారం చేస్తున్నారు. తాజాగా సోమవారం కూకట్పల్లిలోని అల్లాపూర్ డివిజన్లో పర్యటించారు. ఇక్కడ ఆమెను తెరాస కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో తెరాస, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. నియోజకవర్గంలోని అల్లాపూర్ డివిజన్ తెరాస కార్యాలయం ముందు వద్ద నుంచి సుహాసిని వెళ్తున్నారు.
సుహాసినిని అడ్డుకున్నారు
ఈ సమయంలో తెరాస కార్యకర్తలు సుహాసినిని అడ్డుకున్నారు. ఇది ఘర్షణకు దారి తీసింది. పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు. ఈ నేపథ్యంలో అప్పటికి సుహాసిని తన ప్రచారాన్ని అర్ధాంతరంగా ముగించి వెళ్లిపోయారు. తెరాస కార్యాలయం మీదుగా వెళ్తుండగా, ఆ పార్టీ కార్యకర్తలు దుర్భాషాలాడారని, వారు రెచ్చగొట్టినా తాము సంయమనంతో వ్యవహరించామని టీడీపీ నేతలు చెబుతున్నారు.
అరెస్ట్ చేయాలని డిమాండ్
ఈ గొడవకు కారణమైన తెరాస నేతలు, కార్యకర్తలు అరెస్ట్ చేయాలని తెలుగుదేశం పార్టీ వర్గీయులు పోలీసులను డిమాండ్ చేశారు. కాగా, నందమూరి సుహాసినికి ఆదివారం కూడా చేదు అనుభవం ఎదురైంది. ఆమె ప్రచారం చేస్తుండగా తెరాస శ్రేణులు అడ్డుకున్నాయి.
3 బహిరంగ సభల్లో జూ.ఎన్టీఆర్, క్లుప్తంగా మాట్లాడే ఛాన్స్
ఇదిలా ఉండగా, నందమూరి సుహాసిని తరఫున జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేస్తారనే ఊహాగానాలు వినిపిస్తోన్న విషయం తెలిసిందే. ఆయన ఈ నెల 27వ తేదీ నుంచి 29వ తేదీ వరకు ప్రచారం చేయనున్నారని తెలుస్తోంది. మూడు పబ్లిక్ మీటింగ్లలో పాల్గొని, క్లుప్తంగా మాట్లాడుతారని తెలుస్తోంది. జూ.ఎన్టీఆర్తో పాటు నందమూరి బాలకృష్ణ, కళ్యాణ్రామ్, తారకరత్న కూడా ప్రచారం చేయనున్నారు.