మునుగోడులో బీజేపీ కొత్త గేమ్ ప్లాన్ - చివరి నిమిషంలో సడన్ ఛేంజ్..!!
మునుగోడులో గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ కొత్త వ్యూహాలను అమలు చేస్తోంది. వచ్చే నెల 3వ తేదీన మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ జరగనుంది. 1వ తేదీ సాయంత్రం ప్రచారం ముగియనుంది. దీంతో, 31వ తేదీ బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా ప్రచారంలో పాల్గొనేలా తొలుత షెడ్యూల్ సిద్దం చేసారు. కానీ, ఇప్పుడు వ్యూహం మార్చారు. తెలంగాణలో చోటు చేసుకుంటున్న తాజా రాజకీయ పరిణామాల నడుమ జేపీ నడ్డా పర్యటన రద్దయింది. సభ నిర్వహణ కంటే మండలాల వారీగా ముఖ్య నేతలతో ప్రచారం చేయించాలని నిర్ణయించారు. ఈ సభలకు కీలక నేతలను ఆహ్వనించారు.
ఈ సభలకు అస్సాం ముఖ్యమంత్రి హేమంత బిశ్వశర్మ, స్మృతీ ఇరానీ, తేజస్వి సూర్యతో పాటు ముఖ్య నేతలను రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. మండలాల వారీగా నిర్వహించే సభలకు 25 వేల జన సమీకరణకు నిర్ణయించారు. నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో ప్రచారానికి ప్రత్యేక ప్రణాళికలు సిద్దం చేసింది. ప్రతీ మండలంలో బైక్ ర్యాలీకు నిర్ణయించారు. జాతీయ స్థాయి నేతలతో తెలంగాణ బీజేపీ నేతలు కలిసి ప్రచారం నిర్వహించనున్నారు. మునుగోడు ప్రచారం ముగుస్తున్న వేళ పార్టీ రాష్ట్ర ఇంఛార్జ్ తరుణ్ చుగ్ రానున్నారు. ప్రచారం ముగిసే వరకూ ఇక్కడే మకాం వేయనున్నారు. చివరి రెండు రోజులు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేయాలని నిర్ణయించారు.
బీజేపీ యువమోర్చా నేత తేజస్వీ సూర్య బైక్ ర్యాలీల్లో పాల్గొంటారు. ఈ రెండు రోజుల ప్రచారం కోసం మండలాల వారీగా ప్రత్యేకంగా నేతలకు బాధ్యతలు అప్పగించారు. చివరి రెండు రోజుల ప్రచారం కీలకం కావటంతో బీజేపీ కోర్ కమిటీ సభ్యులు మునుగోడు కేంద్రంగా మకాం వేసి గ్రామాల వారీగా పరిస్థితులను సమీక్ష చేస్తున్నారు. ఇదే సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ సభకు టీఆర్ఎస్ నిర్ణయించింది. కాంగ్రెస్ ముఖ్య నేతలంతా రాహుల్ గాంధీ జోడో యాత్రలో పాల్గొంటున్నారు. దీంతో, స్థానిక నేతలే మునుగోడు లో కాంగ్రెస్ అభ్యర్ధికి మద్దతుగా ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే మూడు పార్టీలు ఈ ఉప ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవటంతో..చివరి రెండు రోజుల ప్రచారం కీలకంగా మారుతోంది.