కరీంనగర్ పేరు మార్చిన బీజేపీ!!
భారతీయ జనతాపార్టీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజాసంగ్రామ పాదయాత్ర ఈరోజుతో ముగియనుంది. దీన్ని పురస్కరించుకొని కరీంనగర్ లో భారీగా బహిరంగసభ నిర్వహిస్తోంది. బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా హాజరవుతున్నారు. ఇంతవరకు బాగానే ఉందికానీ ఇక్కడి నుంచే బీజేపీ అసలు కథను ప్రారంభించింది. ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా దినపత్రికల్లో ఫుల్ సైజ్ యాడ్స్ ఇచ్చారు. అందులో కరీంనగర్ పేరును 'కరినగర్' గా పేర్కొన్నారు. ఇప్పటికే హైదరాబాద్ పేరును భాగ్యనగరంగా బీజేపీ నాయకులు పిలుస్తుంటారు.
'కరీం'నగర్ పేరు మార్చాలని ఎప్పటినుంచో బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఉత్తరప్రదేశ్ లో అధికారంలోకి వచ్చిన కొన్ని నగరాలకు పేర్లుగా ముస్లిం సామాజికవర్గాలకు చెందినవారివి ఉండటంతో వాటిని హిందూ పేర్లకు మార్చింది. కర్ణాటకలోను ఇలాగే చేసింది. తెలంగాణలో కూడా తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ పేర్లను మారుస్తామని ప్రకటిస్తూ వస్తోంది. ఈరోజు ఇచ్చిన యాడ్స్ లో కూడా కరీంనగర్ ను 'కరినగర్' గా పేర్కొన్నారు.
హిందూ సెంటిమెంట్ తో హిందువుల ఓట్లన్నీ ఏకీకృతం చేయాలనే ఉద్దేశంతో బీజేపీ నేతలు ఉన్నారని విమర్శలు వస్తున్నాయి. ఇటీవల భైంసా పర్యటించిన బండి సంజయ్ తాము అధికారంలోకి రాగానే భైంసా పేరును మారుస్తామని ప్రకటించారు. ఇప్పుడు కరీంనగర్ కు అలాగే చెప్పారు. కరి అంటే ఏనుగు అనే అర్థం ఉందని, కరీం నగర్ లో కరీం అనేది ముస్లిం పేరు అని, అందుకే తాము కరినగర్ గా పిలుస్తామన్నారు. తన ట్విట్టర్ లోను బండి సంజయ్ కరినగర్ గానే పేర్కొంటారు. బీజేపీ నేతలు పలకడం కూడా కరినగర్ గానే పలుకుతారు. 'కరినగర్' గా పేర్కొంటూ పత్రికల్లో ప్రకటనలు జారీ చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది