అయ్యా ముఖ్యమంత్రి గారూ.. ఇదేం న్యాయమండి?
తెలంగాణ చీఫ్ సెక్రటరీగా సోమేష్ కుమార్ కొనసాగింపును రద్దు చేస్తూ హైకోర్టు తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. సోమేష్ కుమార్ తక్షణమే పదవికి రాజీనామా చేయాలని భారతీయ జనతాపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం కోర్టు తీర్పును శిరసా వహించాలన్నారు. సోమేష్ కుమార్ను సీఎస్ బాధ్యతల నుంచి తప్పించి ఏపీకి బదిలీ చేయాలన్నారు. 2014 రాష్ట్ర విభజన తర్వాత డీఓపీటీ ఇచ్చిన ఆదేశాలను తుంగలో తొక్కారని మండిపడ్డారు.
ఏపీకి చెందిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు తెలంగాణలో కీలక బాధ్యతలు ఇవ్వడం అనైతికం, అప్రజాస్వామికమని, ముఖ్యమంత్రి కేసీఆర్ ఏనాడూ చట్టాలను, రాజ్యాంగాన్ని, కేంద్ర నిబంధనలను గౌరవించలేదని బండి నిప్పులు చెరిగారు. రాజకీయ అవసరాలే కేసీఆర్ కు ముఖ్యమన్నారు.

తెలంగాణకు కేటాయించిన ఎందరో అధికారులు సీనియారిటీ లిస్టులో ఉన్నారని, కానీ ఏపీ క్యాడర్ కు చెందిన సోమేష్ కుమార్ను సీఎస్గా నియమించడం ద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్ భారీగా లబ్ధిపొందారని విమర్శించారు. సోమేష్ ద్వారా 317 జీవో సహా అనేక ఉద్యోగ, ప్రజా వ్యతిరేక ఉత్తర్వులను విడుదల చేయించారని, రెవెన్యూ, ఇరిగేషన్, హెచ్ఎండీఏ, హోం తదితర శాఖల్లో తమకు అనుకూలమైన అధికారులను నియమించుకుని భారీగా అవినీతికి పాల్పడేందుకు సీఎస్ సోమేష్ కుమార్ ను ఒక పావుగా వాడుకున్నారని వెల్లడించారు.
కోర్టులో కేసులు పెండింగ్ లో ఉన్న సమయంలో సోమేష్ ను చీఫ్ సెక్రటరీగా నియమించడమంటే కేసీఆర్ అనైతిక రాజకీయాలకు ఒక ఉదాహరణ అన్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ఒక న్యాయం? సోమేష్ కుమార్ కు ఒక న్యాయమా? అని ప్రశ్నించారు. ఇప్పటికైనా హైకోర్టు ఆదేశాల ప్రకారం సోమేష్ ను తొలగించి తెలంగాణకు చెందిన వ్యక్తిని చీఫ్ సెక్రటరీగా నియమించాలని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications