విద్యార్థులతో చెలగాటమా?ఫీజు రీయంబర్స్ మెంట్,స్కాలర్ షిప్ లను వెంటనే చెల్లించాలన్న బీజేపీ ఛీఫ్.!
హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వ విధానాలపై మరో సారి మండిపడ్డారు బీజేపి తెలంగాణ అద్యక్షుడు, ఎంపీ బండి సంజయ్. సంక్షేమ పథకాల అమలులో పాటు అనేక సమస్యలపట్ల తెలంగాణ ప్రభుత్వాన్ని నిలదీసిన బండి సంజయ్ తాజాగా విద్యార్థుల సమస్యల పట్ల ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. తెలంగాణలో చదువుకొనసాగిస్తున్న పేద, మద్యతరగతి విద్యార్దుల సమస్యలు వర్ణనాతీతంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేసారు బండి సంజయ్.
బీసి విద్యార్థులకు స్కాలర్ షిప్,ఫీజు రీయంబర్స్ మెంట్ ఇవ్వాలి..
గత రెండేళ్లుగా బీసీ విద్యార్థులకు ఫీజు రీయంబర్స్ మెంట్, స్కాలర్ షిప్పులు చెల్లించకపోవడంతో దాదాపు 3 వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం బకాయిపడిందని మండిపడ్డారు. ఫీజులు కట్టాలంటూ విద్యార్థులపై కళాశాల యాజమాన్యాలు ఒత్తిడి తెస్తున్నాయన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల దాదాపు 14 లక్షల మంది బీసీ విద్యార్థులు మానసిక క్షోభ అనుభవిస్తున్నారన్నారు బండి సంజయ్.
విద్యార్ధుల పట్ల ప్రభుత్వం కక్ష్యపూరితంగా వ్యవహరిస్తోంది..
ఫీజులు చెల్లించకపోవడంతో బీటెక్, బీఈ, ఎంటెక్, ఎంబీఏ, ఎంసీఏ వంటి కోర్సులు పూర్తి చేసినా సర్టిఫికేట్లు ఇచ్చేందుకు కాలేజీ యాజమాన్యాలు నిరాకరిస్తున్నాయని ధ్వజమెత్తారు. ఉమ్మడి రాష్ట్రంలో ఇంజనీరింగ్, మెడిసిన్, డిగ్రీ, పీజీ కోర్సులకు ఫీజులు ఎంత ఉంటే అంత ప్రభుత్వమే చెల్లించేదని గుర్తు చేసారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక ఫీజు రీయంబర్స్ మెంట్ పథకానికి తూట్లు పొడిచిందని నిప్పులు చెరిగారు.
అస్థవ్యస్తంగా విద్యావిదానం..
అంతే కాకుండా 10 వేల లోపు ర్యాంకు వచ్చిన వారికి మాత్రమే ఫీజులు పూర్తిగా మంజూరు చేస్తూ ఆ పై ర్యాంకు వచ్చిన వారికి 35 వేల రూపాయలు మాత్రమే చెల్లిస్తోందని ధ్వజమెత్తారు. దీంతో మిగిలిన ఫీజు కట్టలేక విద్యార్థులు ఉన్నత చదువులకు దూరమవుతున్నారని, బీసీ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను ద్రుష్టిలో ఉంచుకుని ఫీజు రీయంబర్స్ మెంట్, స్కాలర్ షిప్ బకాయిలను వెంటనే చెల్లించాలన్నారు బండి సంజయ్.
దేశంలో ఎక్కడా లేని పతకాల అమలు అంటే ఇదేనా.?
దేశంలో ఎక్కడా అమలు కాని పథకాలను తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్నామని సొంత డబ్బా కొట్టుకుంటున్న ప్రభుత్వం విద్యార్దుల అంశంలో అనుసరించే విధానాలు ఇవేనా అని సూటిగా ప్రశ్నించారు బండి సంజయ్. ఉమ్మడి ప్రభుత్వంలో మాదిరిగానే ఇంజనీరింగ్, మెడిసిన్, ఐఐటీ వంటి ప్రొఫెషనల్ కోర్సులు చదివే వారికి పూర్తిగా ఫీజులు చెల్లించేలా జీవో నెం.18ను సవరించాలని బండి సంజయ్ డిమాండ్ చేసారు.