అష్టమ బంధనం.. ఆర్థిక దిగ్భంధనం.. తెలంగాణలో బీజేపీ వ్యూహం!!
తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లోను విజయం సాధించాలనే పట్టుదలను ప్రదర్శిస్తున్న భారతీయ జనతాపార్టీ కేంద్ర పెద్దలు ఇప్పుడు సరికొత్త వ్యూహాన్ని రూపొందించారు. రాష్ట్రాన్ని ఆర్థికంగా అష్టదిగ్బంధనం చేయడమే ఈ వ్యూహంలో భాగం. తెలంగాణ ప్రభుత్వానికి ఎక్కడా రూపాయి అప్పు పుట్టనివ్వకుండా చేసి ప్రజల్లో వ్యతిరేకత తీసుకువస్తారు. ఆ వ్యతిరేకతను ఎన్నికల్లో సొమ్ముచేసుకుందామనేది వారి ప్రణాళిక. రాష్ట్రంలో ఆర్థికంగా అలజడి సృష్టించి అధికారంలోకి రావడమే ఈ వ్యూహంలో ముఖ్యమైన అంశం.

బిల్లులు, పింఛన్లు పెండింగ్ లోనే..
ప్రస్తుతం తెలంగాణలో రూ.25వేల కోట్లు బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. ఆ బిల్లుల చెల్లింపు కోసం కాంట్రాక్టర్లు ఎదురుచూస్తున్నారు. అలాగే పింఛన్లు కూడా పెండింగ్ లో నే ఉన్నాయి. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయనే ఉద్దేశంతో కొత్త పింఛన్లు, కొత్త రేషన్ కార్డులను ప్రభుత్వం కొన్నాళ్లుగా మంజూరు చేయడంలేదు. ప్రశాంత్ కిషోర్ తాజా సర్వేలో కూడా ఇవి రెండూ ఇస్తే పార్టీ విజయానికి ఢోకా లేదని తేలింది. కానీ అందుకు డబ్బులు కావాలి. ఆ డబ్బులు ఖజానాకు చేరాలంటే కేంద్రం సాయం చేయాలి.

రూపాయి అప్పు రాకుండా అడ్డుకుంటున్న కేంద్రం
కేంద్రం సాయం చేయడంలేదు కాబట్టి ఆర్థిక సంస్థలు, బ్యాంకుల నుంచి అప్పు తెచ్చుకోవాలని ప్రభుత్వం ప్రయత్నించింది. తెలంగాణకు ఎక్కడా రూపాయి కూడా అప్పు రానివ్వకుండా కేంద్రం అడ్డుకుంటోంది. ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు చెల్లించడం కూడా రెండువారాలు ఆలస్యమవుతోంది. ధాన్యం సేకరించి నెలదాటినా రైతులకు చెల్లించాల్సిన సొమ్ము మరో రూ.500 కోట్లు పేరుకుపోయింది. దీంతో వివిధ వర్గాల నుంచి ప్రభుత్వంపై వ్యతిరేతక వ్యక్తమవుతోంది. భారతీయ జనతాపార్టీ పెద్దలకు కావల్సింది కూడా ఇదే.

స్థలాల విక్రయం ద్వారా కొంత సర్దుబాటు
ఎఫ్ఆర్బీఎం లిమిట్స్ దాటి అప్పులు చేయడానికి కేంద్రం తెలంగాణకు అనుమతి ఇవ్వడంలేదు. కేంద్రం నుంచి రాష్ట్రానికి వివిధ పథకాల కింద రావాల్సినవి రూ.7800 కోట్లుగా ఉన్నాయి. సెస్సుల పేరుతో 11 శాతం నిధులను కేంద్రం విడుదల చేయడంలేదని రాష్ట్ర ప్రభుత్వం ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో హైదరాబాద్లోని విలువైన స్థలాలను విక్రయించి కొంతవరకు సర్దుబాటు చేసుకోవాలనే యోచనలో టీఆర్ ఎస్ సర్కారు ఉంది. నగరంలో విలువైన స్థలాలను గుర్తించాలని ప్రభుత్వం ఇప్పటికే వివిధ శాఖలకు ఆదేశాలు జారీచేసింది. వాటిని విక్రయించడంద్వారా వచ్చిన సొమ్ముతోనైనా పథకాలను ఎన్నికల వరకు కొనసాగించి గట్టెక్కాలని ప్రభుత్వం యోచిస్తోంది.












Click it and Unblock the Notifications