కాంగ్రెస్లో చేరిన తెలంగాణ బీజేపీ సీనియర్ నేత: బండి సంజయ్కు షాక్
Telangana Lok Sabha election 2024: లోక్సభ ఎన్నికలకు గడువు సమీపిస్తోన్న కొద్దీ తెలంగాణలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. వలసలు, చేరికలు జోరుగా సాగుతున్నాయి. ప్రత్యేకించి- ప్రతిపక్ష భారత్ రాష్ట్ర సమితి వలసల బెడదను ఎదుర్కొంటోంది. అధికారాన్ని కోల్పోయాక పలువురు సీనియర్లు బీఆర్ఎస్ను వీడారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలు సైతం దీనికి మినహాయింపు కాదు.
ఇప్పటికే చాలామంది బీఆర్ఎస్ నాయకులు పార్టీని వీడారు. బీఆర్ఎస్ సెక్రెటరీ జనరల్ కే కేశవరావు కూతురు, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఛైర్పర్సన్ గద్వాల విజయలక్ష్మి, మాజీ మంత్రి కడియం శ్రీహరి, కడియం కావ్య, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్.. వంటి పలువురు సీనియర్లు కారు దిగారు.

ఇప్పుడు తాజాగా భారతీయ జనతా పార్టీలో ఈ వలసలు చోటు చేసుకుంటోన్నాయి. సిద్ధిపేట్ జిల్లా హుస్నాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన బీజేపీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే బొమ్మ వెంకన్న కుమారుడు బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి తాజాగా కాంగ్రెస్లో పార్టీలో చేరారు.
ఈ మధ్యాహ్నం హైదరాబాద్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ఆయనకు కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఆ సమయంలో శ్రీరామ్ చక్రవర్తి వెంట మంత్రి పొన్నం ప్రభాకర్, మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి, కొందరు నాయకులు ఉన్నారు.
కరీంనగర్ లోక్సభ పరిధిలోకి వచ్చే అసెంబ్లీ నియోజకవర్గం.. హుస్నాబాద్. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు శ్రీరామ్ చక్రవర్తి. పొన్నం ప్రభాకర్ చేతిలో ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో మూడో స్థానానికి పరిమితం అయ్యారాయన.
ఇంకో వారం రోజుల్లో లోక్సభ ఎన్నికల పోలింగ్ జరుగనున్న నేపథ్యంలో శ్రీరామ్ చక్రవర్తి పార్టీ ఫిరాయించడం బీజేపీకి భారీ నష్టంగా భావిస్తోన్నారు. కరీంనగర్ నుంచి లోక్సభ బరిలో నిలిచిన సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్కు అత్యంత ఆప్తుడిగా పేరున్న శ్రీరామ్.. పార్టీని వీడటం ప్రాధాన్యతను సంతరించుకుంది.












Click it and Unblock the Notifications